
‘మారెళ్లపాడు’కు నిధులేవి?
● ముందుకు సాగని ఎత్తిపోతల పథకం ● రూ.92.21 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు
అశ్వాపురం: సీతారామ ప్రధాన కాలువకు అనుబంధంగా నిర్మించతలపెట్టిన మారెళ్లపాడు ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దీంతో రైతులు నిరాశ చెందుతున్నారు. అశ్వాపురం మండలానికి సీతారామ ప్రాజెక్ట్ జలాలు అందించేందుకు ఈ లిఫ్ట్ నిర్మాణం తలపెట్టారు. సీతారామ ప్రాజెక్ట్ ఫేస్–1 నిర్మాణంలో భాగంగా రూ.25 కోట్లతో పంప్హౌస్ నిర్మాణానికి గత ప్రభుత్వంలో 29 జనవరి 2023న శంకుస్థాపన చేశారు. పంప్హౌస్తోపాటు ఎలకలగూడెంలో 2.230 కిలోమీటర్ వద్ద డెలీవరి సిస్టం వరకు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. శంకుస్థాపన చేసి రెండేళ్లు గడిచినా కేవలం ఎర్త్ వర్క్ పనులు మాత్రమే జరిగాయి. బీజీ కొత్తూరు పంప్హౌస్ సమీపంలో 9.850 కిలోమీటర్ వద్ద మారెళ్లపాడు ఎత్తిపోతల పథక నిర్మాణం చేపట్టారు. ఫేజ్–1లో పంప్హౌస్, డెలీ వరి సిస్టం వరకు నిర్మించాల్సి ఉంది. డెలీవరి సిస్టం నుంచి 10.950 కిలోమీటర్ల మేర రెండు గ్రావిటీ కెనాల్లు నిర్మించనున్నారు. ఎలకలగూడెం నుంచి మణుగూరు వైపు 9.65 కిలోమీటర్లుతో ఒక గ్రావిటీ కెనాల్, 1.30 కిలోమీటర్తో తుమ్మలచెరువుకు మరో గ్రావిటీ కెనాల్ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపారు. గ్రావిటీ కెనాల్, స్ట్రక్చర్స్ నిర్మాణానికి రూ.92.21 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు నిధులు మంజూరు చేయలేదు.
మంత్రులు, సీఎం దృష్టికి తీసుకెళ్లా
మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా మండలంలో 16,181 ఎకరాలకు సాగునీరు అందుతుంది. పంప్హౌస్ పనులు పూర్తయితే తుమ్మలచెరువుకు నీరు తరలించి సుమారు 8 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. గ్రావిటీ కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రులు, సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లా. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా మండలానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తా.
–పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే పినపాక
పథకం పూర్తయితే 16,181 ఎకరాలకు సాగునీరు..
మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తయితే మండలంలో 16,181 ఎకరాలకు సాగునీరు అందుతుంది. మండలంలోని తుమ్మలచెరువు, చింతలచెరువు, చాకలికుంట, రంగప్పకుంట, శనగకుంట, దేవేంద్రునికుంట, అప్పలకుంట, పొగాకుకుంట, ఊర కుంట, ఎర్రబొక్కలచెరువు, మేర రామయ్య కుంటల ద్వారా సాగునీరు అందించనున్నారు. అయితే నిధులు లేకపోవడంతో పనులు సాగడంలేదు. ప్రభుత్వం స్పందించి లిఫ్ట్ నిర్మాణం పూర్తిచేయాలని, సీతారామ జలాలు ఈ ప్రాంత రైతాంగానికి అందించాకే ఇతర ప్రాంతాలకు తరలించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు.

‘మారెళ్లపాడు’కు నిధులేవి?