
వైద్యారోగ్యశాఖలో కదలిక
అశ్వారావుపేటరూరల్: మండలంలోని వినాయకపురం పీహెచ్సీ పరిధి కొండరెడ్ల గ్రామమైన పాత రెడ్డిగూడెంలో కొద్ది రోజులుగా మలేరియా, విష జ్వరాల విజృంభిస్తున్నాయి. ఇదే విషయమై సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘వణికిస్తున్న జ్వరాలు’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల్లో కదలిక వచ్చింది. డీఎంహెచ్ఎ డాక్టర్ భాస్కర్ నాయక్ జ్వరాల విజృంభణపై ఆరా తీశారు. మలేరియా ప్రభావిత గ్రామమైన పాత రెడ్డిగూడెంతోపాటు బండారుగుంపు, మేడారం కాలనీ గ్రామాలను జిల్లా మలేరియా అధికారి డాక్టర్ స్పందన సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడి వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న దోమల నివారణ స్ప్రే కార్యక్రమాన్ని తనిఖీ చేసి, ప్రతి ఇంటికీ స్ప్రే చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇళ్ల పరిసరాల్లో యాంటీ లార్వా ఆపరేషన్లు, డ్రైడే కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం వినాయకపురం పీహెచ్సీని సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమాల్లో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రాందాస్ నాయక్, డీపీఎంఓ మోహన్, సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం బేబి నాంచారి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

వైద్యారోగ్యశాఖలో కదలిక