
ఓసీ విస్తరణ పనుల అడ్డగింత
ఇల్లెందురూరల్: సింగరేణి జేకే విస్తరణ కోసం చేపట్టనున్న విస్తరణ పనులను సోమవారం నిర్వాసితులు, 21 పిట్ ఏరియా ప్రజలు, అఖిలపక్ష కమిటీ నాయకులు అడ్డుకున్నారు. నిర్వాసితులు, ప్రభా విత ప్రజల డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. నేల చదును చేసేందుకు వచ్చిన యంత్రాలకు అడ్డుగా నిలవడంతో పనులు ఆగిపోయాయి. రెవెన్యూ అధికారులు తమకు స్థలం అప్పగించారని ఎస్టేట్ అధికారి శివ తెలపగా, దశాబ్దాలుగా గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూమిని సింగరేణికి ఎలా ధారాదత్తం చేస్తారని అఖిల పక్ష కమిటీ నాయకులు ప్రశ్నించారు. 21పిట్ ఏరియాలో నిర్వాసితులకు ప్యాకేజీ చెల్లింపుపై, ప్రభావిత ప్రాంత ప్రజలకు ఎలా న్యాయం చేస్తారో నేటికీ చెప్పలేదని ప్రశ్నించారు. దీంతో సింగరేణికి అప్పగించిన సాగుభూమిపై ఆర్డీవో వద్ద విచారణ పెండింగ్లో ఉన్నందున నిర్ణయం వెలువడే వరకు పనులు నిలిపివేస్తామని రెవెన్యూ ఆర్ఐ కామేశ్వరరావు హామీ ఇవ్వడంతో ఇరువర్గాలు వెనుతిరిగాయి. అనంతరం 21పిట్ అఖిల పక్ష కమిటీ ప్రతినిధులు పూనెం సురేందర్, నబీ, శ్రీను, రాజు, నాగరాజు, హరికృష్ణ, మహేష్, రమేష్ తదితరులు మాట్లాడుతూ.. 2013 ఆర్అండ్ఆర్ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని, క్వార్టర్లను నివాసం ఉంటున్న వారికే అప్పగించాలని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా పోలీసులు బందోబస్తు చేపట్టారు.