
నేడు డయల్ యువర్ డీఎం
చుంచుపల్లి: కొత్తగూడెం, ఇల్లెందు పట్టణ పరిసర ప్రాంతాల ఆర్టీసీ ప్రయాణికులకు సమస్యల పరిష్కారం కోసం బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు డయల్ యువర్ డీఎం ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కొత్తగూడెం డిపో మేనేజర్ దేవేందర్గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సూచనలు, సలహాలు, ఫిర్యాదుల కోసం 99592 25959 ఫోన్ నెంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు.
అటవీ ఉత్పత్తులను
డీఆర్ డిపోలో విక్రయించాలి
గుండాల: అటవీ ఉత్పత్తులను డీఆర్ డిపోలో విక్రయించే సౌకర్యం కల్పించామని జీసీసీ మేనేజర్ నరసింహారావు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని జీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ ఉత్పత్తులను మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దని, గిరిజన సహకార సంస్థ ద్వారా కిలో ముష్టి గింజలు రూ.75, కుంకుళ్లు రూ.40, ఇప్పపూలు రూ.30, ఇప్పపలుకు రూ.29, కరక్కాయ రూ.15, కానుగకాయ రూ.10తో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అకౌంటెంట్ బూసేయ్య, జీసీసీ సేల్స్మెన్లు పూనెం లక్ష్మయ్య, గలిగ చెన్నయ్య, అంబటి శ్రీనివాస్, మోల్కం పగడయ్య పాల్గొన్నారు.
జెడ్పీకి గుండాల ఎంపీడీఓ డిప్యూటేషన్
గుండాల: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందున గుండాల ఎంపీడీఓ సత్యనారాయణను డిప్యూటేషన్పై జెడ్పీకి బదిలీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం, ఉపాధి హామీ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో జాప్యంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, వీడియో కాన్ఫరెన్స్కు హాజరు కావడం లేదనే ఆరోపణలు రాగా.. జిల్లా అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో మంగళవారం ఎంపీడీఓ సత్యనారాయణను జిల్లా పరిషత్ కార్యాలయానికి డిప్యూటేషన్పై బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో టేకులపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న సామల శ్రీనివాసరావుకు గుండాల ఎంపీడీఓగా నియమిస్తూ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.
కలప స్వాధీనం..
ట్రాక్టర్ సీజ్.. కేసు నమోదు
కరకగూడెం: అక్రమంగా అటవీ ప్రాతంలో చెట్లు నరికి గుట్టుచప్పుడూ కాకుండా కలప తరలిస్తున్న వ్యక్తిని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఏడూళ్ల బయ్యారం రేంజర్ తేజస్వి కథనం ప్రకారం.. రేగుళ్ల గ్రామానికి చెందిన కొండగొర్ల సమ్మయ్య మంగళవారం అనంతారం బీట్ పరిధిలోని అటవీ ప్రాంతం నుంచి టేకు, బిల్లుడు, చెన్నంగి, కొడిశ వాసాలను తన ట్రాక్టర్లో ఇంటికి తరలిస్తున్న క్రమంలో ఫారెస్ట్ సిబ్బంది స్వాధీనం చేసుకొని రేంజ్ కార్యాలయానికి తరలించారు. ట్రాక్టర్ను సీజ్ చేసి సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశామని తెలిపారు. కలప విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందన్నారు. తనిఖీల్లో ఎఫ్ఎస్ఓలు సూరయ్య, ఏడుకొండల్, బీట్ ఆఫీసర్ రోజా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మెను
జయప్రదం చేయండి
ఖమ్మంమయూరిసెంటర్: పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేలా నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడాన్ని నిరసిస్తూ వచ్చేనెల 20న చేపట్టే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. ఖమ్మంలో అఖిలపక్ష కార్మిక సంఘాల బాధ్యులు మంగళవారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శులు శింగు నర్సింహారావు, జె.వెంకటేష్, కె.సూర్యం, ఐఎన్టీయూసీ నాయకులు పాల్వంచ కృష్ణ మాట్లాడారు. కార్మికుల కోసం అమల్లో ఉన్న ప్రతీ హక్కు వెనక దశాబ్దాల పోరాటం దాగి ఉందని తెలిపారు. వీటిని కాలరేసేలా ప్రయత్నిస్తున్న కేంద్రానికి గుణపాఠం చెప్పేందుకు సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు గాదె లక్ష్మీనారాయణ, నరాల నరేష్నాయుడు, విష్ణువర్దన్, ఏ.వెంకటరెడ్డి, ఐ.వెంకన్న, తోట రామాంజనేయులు, కళ్యాణం వెంకటేశ్వరరావు, జి.రామయ్య, నీలం రాజేష్, పటేల్ పాల్గొన్నారు.

నేడు డయల్ యువర్ డీఎం