రోడ్డు ప్రమాదంలో సాక్షి ఉద్యోగి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో సాక్షి ఉద్యోగి మృతి

Mar 18 2025 12:43 AM | Updated on Mar 18 2025 12:41 AM

కొత్తగూడెంటౌన్‌: మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాక్షి దినపత్రిక ఉద్యోగి సోమవారం మృతి చెందాడు. కొత్తగూడెం వన్‌టౌన్‌ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని న్యూగొల్లగూడేనికి చెందిన తాటిపల్లి రాజేష్‌కుమార్‌(38) సాక్షి దినపత్రికలో సీనియర్‌ యాడ్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 14న మధ్యాహ్నం బైక్‌పై రామవరంలో స్నేహితుడి ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కొత్తగూడెం వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో రాజేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అదే కారులో క్షతగాత్రుడిని కొత్తగూడెం జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కుటుంబ సభ్యులు వరంగల్‌ ఎంజీఎంకు, అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య నాగలక్ష్మి, ఏడేళ్లలోపు కూతుళ్లు ఇద్దరు ఉన్నారు.

సాక్షులపై బెదిరింపులు?

పోలీసుల విచారణలో ప్రమాదానికి కారణమైన కారు రుద్రంపూర్‌ తిలక్‌నగర్‌కు చెందిన వ్యక్తిదిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వ సబ్సిడీపై పొందిన కారు అయినప్పటికీ మూడేళ్లుగా నంబర్‌ ప్లేట్‌ లేకుండా నడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారు నడిపింది ఎవరనే విషయం తెలియాల్సి ఉంది. రోడ్డు ప్రమాదాన్ని చూసిన సాక్షులను సైతం కారుతో ఢీకొట్టినవారు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ విషయమై కొత్తగూడెం వన్‌టౌన్‌ సీఐ ఎం.కరుణాకర్‌ను వివరణ కోరగా.. బైక్‌ను కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. కారు రుద్రంపూర్‌ తిలక్‌నగర్‌కు చెందిన వ్యక్తిదిగా గుర్తించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ఫిర్యాదు అందలేదని వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement