సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి లోని కెవికె గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో హాకీ ఇండియా 10వ ఎస్ఎన్బీపీ ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్–2026 (అండర్ 16) బాలుర కోసం సామ్రాట్ హాకీ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఎంపిక ట్రయల్స్ నిర్వహించారు. ఈ ఎంపిక ట్రయల్స్కు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలకు చెందిన మొత్తం 75 మంది యువ హాకీక్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించి సామ్రాట్ హాకీ అకాడమీ జట్టులో స్థానం పొందారు. రిటైర్డ్ పీడీ దాసరి కోటేశ్వరరావు,ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్స్ జి.రవి, పి.పవన్ కుమార్, నేషనల్ హాకీ అంపైర్ డి సురేష్, నేషనల్ హాకీ ప్లేయర్ పి ప్రసన్నకుమార్లు ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. ఎంపికై న క్రీడాకారులు అక్టోబర్ 1 నుంచి 7 వరకు మహారాష్ట్రలోని పూణేలో జరగనున్న హాకీ ఇండియా 10వ ఎస్ఎన్బీపీ ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్–2026 లో సామ్రాట్ హాకీ అకాడమీ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎంపిక ట్రయల్స్ అనంతరం మొత్తం 40 మంది క్రీడాకారులను కోచింగ్ క్యాంపునకు ఎంపిక చేశారు. జాతీయస్థాయి టోర్నమెంట్కు క్రీడాకారులను సన్నద్ధం చేయడానికి ఈనెల 20 నుంచి 30 వరకు ప్రత్యేక కోచింగ్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఈసందర్భంగా సామ్రాట్ హాకీ అకాడమీ ఫౌండర్, చైర్మన్ చెన్నం మల్లికార్జునరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో హాకీ క్రీడాభివృద్ధికి, ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడానికి అందిస్తున్న విలువైన సహకారం, ప్రోత్సాహం, మార్గదర్శకత్వానికి హాకీ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రెటరీ జి.హర్ష వర్ధన్కు సామ్రాట్ అకాడమీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.


