బాపట్లటౌన్: ఎందరో ప్రాణాలు కాపాడుతున్నాం...మా బతుకులు రోడ్డున పడకుండా కాపాడండి అంటూ ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ సభ్యులు కూరపాటి సత్యంరాజు తెలిపారు. ఏరియా వైద్యశాలలోని పెరట్లో ప్లకార్డులు చేబూని మొక్కలకు నీరు పోస్తూ వినూత్న రీతిలో శనివారం నిరసన తెలిపారు. సత్యంరాజు మాట్లాడుతూ పర్యావరణానికి ఆక్సిజన్ అందిద్దామనే ఉద్దేశంతో మొక్కలు నాటుతున్నాం, కానీ మా బతుకులకే ఊపిరి అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మా జీవితాలకు కూడా ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు.సృష్టిలో ప్రతి మనిషి సమానమే. ఒకరు ఎక్కువ కాదు... మరొకరు తక్కువ కాదు. అలాంటప్పుడు మాకెందుకు ఈ వివక్ష? మాకెందుకు తక్కువ జీతాలు? మేము చేస్తున్న సేవకు తగిన గుర్తింపు, భద్రత, గౌరవం ఎందుకు దక్కడం లేదు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో రోగులకు సేవలు అందించేటప్పుడు మా కష్టాలను మేము మర్చిపోతాం. వారి ప్రాణాలు కాపాడటమే మా బాధ్యతగా భావిస్తాం. ప్రజలకు ఆరోగ్యం అందించే మేము మాత్రం మా కుటుంబాల భవిష్యత్తుపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు నళిని, బి.నీలిమ, సుధా పరిమళ తదితరులు పాల్గొన్నారు.


