కిలో గంజాయితో పాటు ఆటో స్వాధీనం
మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణ శివార్లలో గంజాయి కలిగి ఉన్న ఐదుగురిని అరెస్టు చేసి వారి నుంచి కిలో గంజాయి, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ డాక్టర్ నాగరాజు తెలిపారు. శుక్రవారం సాయంత్రం మార్కాపురం సర్కిల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో సీఐ అల్తాఫ్ హుస్సేన్తో కలిసి ఆయన కేసు వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. పట్టణంలోని సాయిబాలాజీ థియేటర్ సమీపంలోని కంపచెట్లలో ఐదుగురు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అనంతరం వారి వద్ద కిలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. గంజాయితో పాటు ఆటోను సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుల్లో పట్టణంలోని మల్లారెడ్డి కాలనీకి చెందిన మురికిపూడి విజయ్, తాళ్లపల్లి నరేంద్ర, జంకె రామిరెడ్డి నగర్కు చెందిన గొట్టెముక్కల మహానంది, మండలంలోని నాగులవరం గ్రామానికి చెందిన షేక్ జాన్బాషా, పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం సిద్దార్ధనగర్కు చెందిన దూదేకుల లాల్చాంద్బాషా ఉన్నారు. త్రిపురాంతకం మండలం గణపవరం గ్రామానికి చెందిన దమ్ము నాసరయ్య పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు. వీరిలో విజయ్, షేక్ జాన్బాషా, చాంద్బాషాలపై సస్పెక్ట్ షీట్లు, పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. గంజాయి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. గంజాయి విక్రయం, వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు పేర్కొన్నారు. పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


