––––––––––––––––––––––––––
బాపట్లటౌన్: పేదల ఇళ్లు కూల్చడం సరికాదని సీపీఎం జిల్లా నాయకులు ఎన్.బాబురావు తెలిపారు. బాపట్ల 7వ వార్డు శారదాపురి కాలనీలోని శ్మశానవాటిక ప్రహరీ పక్కన పోరంబోకు స్థలంలో 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న సుమారు 20 నిరుపేద కుటుంబాలను ఖాళీ చేయించాలని కొందరు ప్రైవేటు వ్యక్తులు మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం దుర్మార్గమన్నారు. గురువారం బాధితుల పక్షాన ఆందోళనకు దిగారు. సీపీఎం నాయకులు మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులు, నిరుపేద కుటుంబాలు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా అక్కడ నివాసం ఉంటున్నారన్నారు. ఇళ్లను ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడంతో ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అధికారులు పేదలను భయపెట్టే విధంగా వ్యవహరించడం తగదన్నారు. బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేని అనేక కట్టడాలు ఉన్నప్పటికీ వాటి జోలికి అధికారులు వెళ్లడం లేదని, ప్రభుత్వ స్థలాలను బడాబాబులు ఆక్రమించుకున్నా నోటీసులు ఇచ్చే ధైర్యం చేయడం లేదన్నారు. నిరుపేదలు నివాసం ఉండేందుకు చిన్న గూడు నిర్మించుకుంటే మాత్రం అధికారాన్ని ఉపయోగించి వారిపై జులుం చేయడం అన్యాయమన్నారు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు వెంటనే నోటీసులు, తొలగింపు చర్యలను నిలిపివేసి, సంబంధిత కుటుంబాలతో చర్చించి సమస్యకు మానవతా దృక్పథంతో పరిష్కారం చూపాలన్నారు. పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నాలు కొనసాగితే సీపీఎం ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచి ప్రజా ఉద్యమం చేపడతామన్నారు. కార్యక్రమంలో సీపీఎం బాపట్ల పట్టణ నాయకులు కె.శరత్, బాధితులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా నాయకుడు ఎన్.బాబురావు


