రేపల్లె: ఉపాధ్యాయ హక్కుల కోసం నిరంతర పోరాటాలు చేస్తానని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎం.హనుమంతరావు అన్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల శాసనమండలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పీడీఎఫ్ అభ్యర్థి ఎం.హనుమంతరావు పరిచయ కార్యక్రమం పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ఉపాధ్యాయులు, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు విద్యారంగ పరిరక్షణ, ఉద్యోగుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు చేసినట్లు గుర్తుచేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికుల సమస్యలపై శాసనమండలిలో బలంగా గళమెత్తేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల కోసం కేటాయించిన శాసనమండలి స్థానాల్లో రాజకీయ ప్రభావం పెరిగిపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. విద్యారంగంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి హనుమంతరావును గెలిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ బాపట్ల జిల్లా కోశాధికారి సీహెచ్.మణిలాల్, యుటీఎఫ్ జిల్లా కార్యదర్శి అడుగుల శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు వినయ్ కుమార్, నాయకులు జీ.శాంతారావు, సాయిప్రసాద్, గాదె సుబ్రమణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం.హనుమంతరావు


