రేపల్లె: గణపతి నవరాత్రులను పురస్కరించుకుని విగ్రహాల నిమజ్జనానికి పెనుమూడి–పులిగడ్డ వారధిపై రెవెన్యూ, పోలీసులు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రేపల్లె పట్టణంతో పాటు మండలం, నగరం, నిజాంపట్నం మండలాల్లో నెలకొల్పిన గణనాథ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో భక్తులు పెనుమూడి ఘాట్కు తరలివస్తారు. గతంలో నిమజ్జన సమయంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి అధికారులు ముందస్తు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. నాలుగేళ్ల కిందట విగ్రహ నిమజ్జన సమయంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన నేపథ్యంలో భక్తులు నదిలోకి దిగకుండా చర్యలు చేపట్టారు. పెనుమూడి–పులిగడ్డ వారధిపై బారికేడ్లను ఏర్పాటు చేసి వారధి పైనుంచే విగ్రహాలను సురక్షితంగా నదిలో నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేశారు. అదనంగా భద్రతా సిబ్బందిని మోహరించి, ఎటువంటి అవాంఛనీయ జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. విగ్రహాలను సకాలంలో, శాంతియుతంగా నిమజ్జనం చేసుకోవాలని, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


