బాపట్ల: నేటి జీవన విధానంలో చిరు ధాన్యాల ప్రాధాన్యత పెరుగుతుందని, పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సుస్థిర వ్యవసాయానికి చిరుధాన్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని జెనిటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ విభాగాధిపతి డాక్టర్ లాల్ అహమ్మద్ మొహమ్మద్ అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూనరాణి ఆదేశాల మేరకు ఐ.సి.ఏ.ఆర్.–ఐ.ఐ.ఎం.ఆర్, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎస్.సి. ఎస్.పి. పథకంలో భాగంగా నల్లమోతువారిపాలెం ఎస్సీ రైతుల కోసం చిరుధాన్యాల సాగు విలువ జోడింపు ఉత్పత్తుల తయారీపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ లాల్ అహమ్మద్ మొహమ్మద్ మాట్లాడుతూ ఆదాయాభివృద్ధికి చిరుధాన్యాల సాగు దోహదపడుతుందన్నారు. డాక్టర్ ఎం.తుషార వివిధ రకాల చిరుధాన్యాల సాగు పద్ధతులను, అందుబాటులో ఉన్న రకాల గురించి వివరించగా డాక్టర్ ఎన్.రత్నకుమారి చిరుధాన్యాలతో తయారుచేయగల విలువ జోడింపు ఉత్పత్తులను వివరించారు. వాటి ద్వారా స్వయం ఉపాధి పొందగల అవకాశాలను రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ విజయ్ప్రకాష్, డాక్టర్ జి.నెహ్రు తదితరులు పాల్గొన్నారు. రైతులకు చిరుధాన్యాలను అందించారు.


