చినగంజాం: మండలంలోని కడవకుదురు గ్రామం రొంపేరు కాలువ సమీపంలో రొయ్యల చెరువులు తవ్వకాలను జరపడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో కొందరు రైతులు చెరువుల తవ్వేందుకు సన్నాహాలు చేపట్టడంతో గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. చెరువులు తవ్వకాలు జరుపుతున్న రైతులు, గ్రామస్తుల మధ్య వివాదం చెలరేగడంతో సమాచారం అందుకున్న తహసీల్దార్ జీవిగుంట ప్రబాకరరావు, ఎస్ఐ శీలం రమేష్లు సంఘటనా స్థలానికి వెళ్ళి వివాదాలకు కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రొయ్యల చెరువులు తవ్వకం జరపడం వలన భూగర్భజలాలు కలుషితం అయ్యే ప్రమాదముందని, తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా చెరువు తవ్వకాలను నిలిపి వేయాలని వారు అధికారుల ముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తహసీల్దార్ ప్రభాకరరావు.. చీరాల ఎఫ్డీఓ రవీంద్రకు గ్రామంలో శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా చెరువుల తవ్వకాలకు అనుమతులు నిలిపివేయాలని సూచించారు. దాంతో గ్రామస్తులు శాంతించి సంఘటనా స్థలం నుంచి తిరిగి వెళ్ళారు.
అధికారుల జోక్యంతో శాంతించిన
గ్రామ ప్రజలు


