వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారుల సంక్షేమం మూడు పువ్వులు.. ఆరు కాయల్లా సాగింది. బాపట్ల జిల్లాలో 40 గ్రామాల వరకు మత్స్యకారులు, 12 వేల కుటుంబాల వరకు ఉన్నారు. అప్పటి వరకు వేట నిషేధం సమయంలో ఇచ్చే భత్యం రూ.4 వేలు ఉండగా, కేవలం 5 వేల మంది వరకు మాత్రమే ఇచ్చేవారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ భత్యాన్ని ఒక్కసారిగా రూ.10 వేలకు పెంచారు. అర్హతే ఆధారంగా సచివాలయాల నుంచి నేరుగా అర్హుల జాబితా తయారు చేసి జిల్లాలో 11,800 మందికి వేట నిషేధం సమయంలో ఇచ్చే భత్యాన్ని అందించారు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు భత్యం ఇవ్వలేదు. ఇటీవల భత్యాన్ని అరకొరగా విడుదల చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో మత్స్యకారులకు వేట సమయంలో ఉపయోగించే డీజిల్పై 2 శాతం రాయితీ ఉండగా, దానిని 6 శాతానికి పెంచారు. కూటమి అధికారంలోకి వస్తే ఈ సబ్సిడీని 12 శాతానికి పెంచుతామని ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు.
● నాడు సంక్షేమం... నేడు సంక్షోభం
● పలు హామీలు నెరవేర్చని
చంద్రబాబు సర్కార్
● సబ్సిడీపై బోట్లు.. వలలు
ఇస్తామని దగా
● వేట నిషేధం సమయంలో
దిక్కులేని సాయం
గంగపుత్రుల కష్టాలు వినేవారే కరువయ్యారు. తీరంలో ఎగిసిపడే కెరటాలకు ఎదురొడ్డి జీవనం సాగించే మత్స్యకారులకు రోజంతా పనిచేసినా పూట గడవని దుర్భర పరిస్థితి నెలకొంది. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అడిగిందే తడవుగా వరాల జల్లు కురిపించగా, నేడు ఆదుకునేవారే లేరు. రోజంతా వేట సాగించినప్పటికీ ఇల్లు గడవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు మరిచిపోయిందని వాపోతున్నారు. అడగాలంటే వేట నిషేధం సమయంలో ఇచ్చే భత్యం ఎక్కడ నిలిచిపోతుందోననే భయంతో మౌనంగా ఉండిపోతున్నారు. కనీసం పక్కా గృహాలు కూడా లేక గుడిసెల్లోనే మగ్గిపోతున్నారు. ఇకనైనా పాలకులు తమ సమస్యలు తీర్చాలని వేడుకుంటున్నారు.


