నగరం: ఉమ్మడి గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈనెల 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బాలయేసు ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో నిర్వహించిన సబ్ జూనియర్ బాలికల కోచింగ్ క్యాంప్ గురువారంతో ముగిసింది. స్థానిక పాఠశాల ఆవరణంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సజీవ క్రీడాకారిణిలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మార్కాపురంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ క్యాంప్లో శిక్షణ పొందిన క్రీడాకారిణులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో రాణించాలని కోరారు. క్యాంప్ విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన దాతలు చందనం శ్రీనివాసరావు, సీహెచ్.గోపి, శ్రీకాంత్, వేపూరి కిరణ్, జి.ఎరగోపిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ సూనా, వ్యాయామ ఉపాధ్యాయుడు వై.వి.గోపయ్య తదితరులు పాల్గొన్నారు.


