బాపట్లటౌన్: అక్షరాస్యతతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని జిల్లా విద్యాశాఖాధికారి డి.శ్రీనివాససింగ్ అన్నారు. 60వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మండలంలోని మరుప్రోలువారిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ రాష్ట్రాన్ని త్వరలో సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నారు. వయోజన విద్యాశాఖ నోడల్ అధికారి దేవరకొండ కృష్ణ మాట్లాడుతూ సంపూర్ణ అక్షరాస్య సాధనకు ప్రభుత్వంతోపాటు ప్రతి ఒక్కరూ భాగస్వాములై సమష్టి కృషితో అక్షర సమాజ స్థాపనకు కృషిచేయాలన్నారు. అనంతరం అక్షరాస్యతపై డిబేటు చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో ఎస్.నిరంజన్, పాఠశాల హెచ్ఎం ఎ.రమాదేవి, ముత్తాయపాలెం హెచ్ఎం గురజాల శ్రీనివాసరావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వరరెడ్డి, వయోజన విద్యాశాఖ సూపర్వైజర్లు షేక్ బజుల్లా ఆర్ శివప్రసాద్, రవితేజ, సిఫార్డు సంస్థ డైరెక్టర్ కోఆర్డినేటర్ బి కిషోర్, పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.


