స్పెషల్‌ టెట్‌ నిర్వహణపై స్పష్టత ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ టెట్‌ నిర్వహణపై స్పష్టత ఇవ్వాలి

Aug 30 2026 4:49 AM | Updated on Aug 30 2026 4:49 AM

స్పెషల్‌ టెట్‌ నిర్వహణపై స్పష్టత ఇవ్వాలి రేపల్లెలో యూటీఎఫ్‌ బైక్‌ ర్యాలీ విద్యుత్‌ షాక్‌తో యువకుడు మృతి

రేపల్లె: స్పెషల్‌ టెట్‌ పేరుతో సాధారణ టెట్‌ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌న్‌ (యూటీఎఫ్‌) చేపట్టిన ఆందోళనలో భాగంగా రేపల్లెలో ఉపాధ్యాయులు శనివారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. రేపల్లె ఏబీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ప్రారంభమైన బైక్‌ ర్యాలీ తాలూకా, రింగ్‌ రోడ్డు మీదుగా సాగింది. యుటిఎఫ్‌తో పాటు సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు. యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి శాంతారావు మాట్లాడుతూ టెట్‌లో అర్హత మార్కులను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టులకే పరీక్ష నిర్వహించాలని, పరీక్షను ఆఫ్‌లైనన్‌ విధానంలో నిర్వహించాలన్నారు. విద్యాశాఖలో అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు ఎం.బి.సుబ్రహ్మణ్యం, రేపల్లె మండల అధ్యక్షులు జి.సుబ్రహ్మణ్యం, సీఐటీయూ జిల్లా కోశాధికారి సీహెచ్‌.మణిలాల్‌, కార్యదర్శి వి.సుబ్బారావు, నాయకులు చుక్క కోటేశ్వరరావు, కే.రాంబాబు, గణపయ్య, రవీంద్ర, రాజుభూషణం తదితరులు పాల్గొన్నారు.

మార్టూరు: హై టెన్షన్‌ విద్యుత్‌ వైరు తగిలి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని ఇసుక దర్శిలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన అవి వాహితుడు ఉయ్యూరు సురేష్‌ (31) కు తల్లిదండ్రులు లేకపోవడంతో అన్న, వదినతో కలిసి వడ్రంగం పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో సురేష్‌ నిద్రలేచి సమీపంలోని వాగు వద్దకు బహిర్భూమి కోసం వెళుతున్నాడు. ఈ క్రమంలో స్థానిక డొంక రోడ్డు వద్ద తెగిపడి ఉన్న 11 కేవీ హై టెన్షన్‌ విద్యుత్‌ వైరును గమనించకుండా దానిపై కాలు వేయడంతో ఒక్కసారిగా విద్యుత్‌ షాక్‌కు గురైన అక్కడికక్కడే మృతి చెందాడు. కొంతసేపటికి సురేష్‌ మృతదేహాన్ని గమనించిన స్థానికులు బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సురేష్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతికి కారణం సుబాబుల్‌ కడ్డీల వాహనం గ్రామ సరిహద్దులోని డొంక రోడ్డు మరమ్మతుల్లో భాగంగా ఇటీవల గ్రావెల్‌తో ఎత్తు లేపారు. ఈ కారణంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న హై టెన్షన్‌ విద్యుత్‌ వైరు ఎత్తు తగ్గింది. సమీపంలోని పొలాల్లో సుబాబుల్‌ కర్రను లోడ్‌ చేసుకుని ఈ మార్గంలో వాహనం వెళ్లే క్రమంలో సుబాబుల్‌ కర్రలు తగిలి హై టెన్షన్‌ విద్యుత్‌ వైరు తెగి రోడ్డు పక్కన పడిపోయింది. శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగి కొంతసేపు విద్యుత్‌ ప్రసారం ఆగిపోయినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఏం జరిగిందనే విషయం పరిశీలించకుండా తిరిగి విద్యుత్‌ ప్రసారాన్ని పునరుద్ధరించినట్లు స్థానికుల సమాచారం. విషయం తెలియని సురేష్‌ తన దారిన తాను వెళుతూ ప్రమాదవశాత్తు విద్యుత్‌ వైర్‌ పై కాలు వేసి మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతవారం ఇదే ప్రదేశంలో సుబాబుల్‌ లోడు వల్ల విద్యుత్‌ వైరు ఇదే విధంగా తెగిపడటంతో ఆ శాఖ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామానికి లైన్‌ మెన్‌ లేకపోవడం మార్టూరుకు చెందిన లైన్‌మెన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement