మాతృ భాషాభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం | - | Sakshi
Sakshi News home page

మాతృ భాషాభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం

Aug 30 2026 4:49 AM | Updated on Aug 30 2026 4:49 AM

సంఘం అధ్యక్షులు తిమ్మన శ్యామ్‌ సుందర్‌

బాపట్ల: దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగు భాషాభివృద్ధిలో వెనకబాటుతనం కనిపిస్తుందని, ముఖ్యంగా 11వ శతాబ్దం వరకు ఒకే లిపితో కొనసాగిన తెలుగు, కన్నడ భాషలలో ఈ వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తుందని బాపట్ల జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు తిమ్మన శ్యామ్‌ సుందర్‌ అన్నారు. స్థానిక జిల్లా గ్రంథాలయంలో తెలుగు భాష దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కన్నడ భాషాభివృద్ధికి అక్కడి ప్రభుత్వం ప్రముఖ స్థానాన్ని ఇవ్వటమే కాకుండా అభివృద్ధికి ప్రత్యేకంగా దోహదపడుతుందని పేర్కొన్నారు. తెలుగువారికి ఆంగ్ల భాష మీద ఉన్న వ్యామోహం తెలుగు భాషాభివృద్ధికి ప్రతిబంధకమవుతుందని, ప్రాథమిక విద్య నుంచి బాలలకు తెలుగు భాషపై అవగాహన కల్పిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని సూచించారు. తెలుగు అకాడమీ, తెలుగు సారస్వత పరిషత్తులను పునరుద్ధరించి ఆ సంస్థలకు తగిన నిధులను సమకూర్చడం తక్షణ అవసరమని డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశలో ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉన్నప్పటికీ మాతృభాష అభివృద్ధిపై కూడా దృష్టి సారిస్తే రాష్ట్రం సాంస్కృతికంగా ఎదిగి త్వరితగతిన అభివృద్ధికి చేరుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కవి సమ్మేళనంలో ప్రముఖ కవులు ఎం.మాల్యాద్రిరావు, సంగాని శ్రీరాములును ఘనంగా సత్కరించారు. తొలుత వ్యవహారిక తెలుగు భాష ఉద్యమ నేత గిడుగు రామమూర్తికి ఘన నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ విమర్శకులు రచయిత లక్కాకుల వెంకటరావు పాల్గొనగా గ్రంథాలయ అధికారి శివాజీ గణేషన్‌, పోలాసం వీరాంజనేయులు, షేక్‌ బాబావలి, ఆక్సి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement