స్టేట్‌ ఐకాన్స్‌ అవార్డ్స్‌ పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

స్టేట్‌ ఐకాన్స్‌ అవార్డ్స్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

Aug 5 2026 2:35 AM | Updated on Aug 5 2026 2:35 AM

స్టేట్‌ ఐకాన్స్‌ అవార్డ్స్‌ పోస్టర్‌ ఆవిష్కరణ చెకుముకి సైన్స్‌ సంబరాలను విజయవంతం చేయాలి రోడ్డు ప్రమాదంలో సీపీఎం కార్యకర్త మృతి

తాడేపల్లి రూరల్‌: గ్లోబల్‌ ఐకాన్స్‌ ఫోరం సొసైటీ ఆధ్వర్యంలో ‘మన అమరావతి’ థీమ్‌తో నిర్వహిస్తున్న స్టేట్‌ ఐకాన్స్‌ అవార్డ్స్‌–2026 పోస్టర్‌ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ మంగళవారం తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన వారికి గుర్తించి పురస్కారాలతో సత్కరించనున్నట్లు తెలిపారు. ప్రతిభను ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 8వ తేదీ విజయవాడ గుణదలలోని హయ్యత్‌ ప్లేస్‌లో స్టేట్‌ ఐకాన్స్‌ అవార్డ్స్‌–2026ను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్లోబల్‌ ఐకాన్స్‌ షోరం సొసైటీ అధ్యక్షులు చైతన్య, కార్యదర్శి జయా పటేరియా మాట్లాడారు. కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు ఈశ్వర్‌, సంయుక్త కార్యదర్శి కోడే శ్రీచైతన్య, ట్రెజరర్‌ అప్పారావు, కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎ.నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసి, ప్రశ్నించేతత్వం పెంపొందించేందుకు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 8,9,10 తరగతుల విద్యార్థులకు చెకుముకి సైన్స్‌ సంబరాలు నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎ.సత్యనారాయణ ప్రసాద్‌ తెలిపారు. మంగళవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో చెకుముకి సైన్స్‌ సంబరాల పోస్టర్లు విడుదల చేశారు. ప్రసాద్‌ మాట్లాడుతూ ఈనెల 27న పాఠశాల స్థాయి, సెప్టెంబర్‌ 8న మండల, సెప్టెంబర్‌ 27న జిల్లా, నవంబర్‌ 1,2,3 తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొనే విధంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యం ప్రోత్సహించాలని కోరారు. వివరాలకు 90004 53600,84999 32328 నంబర్‌లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉదయ భాస్కర్‌, టి.జాన్‌బాబు, బి.ప్రసాద్‌, టీఆర్‌ రమేష్‌, ఎస్‌ఎం సుభానీ, గురవయ్య, ఇ.అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మార్టూరు: జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మార్టూరు నేతాజీనగర్‌ కాలనీకి చెందిన సీపీఎం సీనియర్‌ కార్యకర్త మణికే బాబు (57) మృతి చెందాడు. చిలకలూరిపేట నుంచి టీవీఎస్‌ వాహనంపై మార్టూరు వస్తున్న బాబును రాజుపాలెం రెస్ట్‌ ఏరియా సమీపంలో అదే మార్గంలో వెనుక నుంచి వస్తున్న వాహనం బలంగా ఢీ కొట్టింది. ప్రమాద ధాటికి వాహనం.. బాబు, టీవీఎస్‌ వాహనంతో పాటు సుమారు 50 మీటర్లు ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లింది. తీవ్ర గాయాలతో బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. హైవే అంబులెన్స్‌ సిబ్బంది నాయక్‌.. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు బాబుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. మూడు దశాబ్దాలుగా సీపీఎంలో కీలక కార్యకర్తగా నిజాయితీపరుడుగా అందరితో కలివిడిగా ఉండే మణికే బాబు మృతి చెందడంతో మార్టూరులో విషాదఛాయలు అలముకున్నాయి. పార్టీ బాపట్ల జిల్లా కార్యదర్శి సీహెచ్‌ గంగయ్య, పార్టీ, సంఘ నాయకులు సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement