అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన
మంగళగిరి టౌన్: ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించి, ఎస్ఎస్ఆర్ ప్రకారం జీతాలు అమలు చేయాలని
ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళగిరి పట్టణంలోని రాష్ట్ర అటవీశాఖ కార్యాలయం వద్ద మంగళవారం డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ చలపతిరావుకు వినతిపత్రం అందజేశారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ఎస్ఎస్ఆర్ ప్రకారం జీతాలు అమలు చేయాలని, ప్రతి నెల క్రమం తప్పకుండా జీతాలు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్లో వున్న ఈపీఎఫ్, ఈస్ఐ బకాయిలను వెంటనే జమ చేయాలని, పెండింగ్లో ఉన్న జీతాల బకాయిలను విడుదల చేయాలన్నారు. సంజీవని ఆరోగ్యబీమా అమలు వంటి డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. అడవుల సంరక్షణలో పనిచేస్తున్న ప్రొటెక్షన్ హెల్పర్లకు రక్షణ పరికరాలు, కనీస సౌకర్యాలు కల్పించాలని, ఖాళీ పోస్టులను భర్తీచేసి అదనపు పనిభారం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాజు, కార్యదర్శి కార్తీక్, అటవీశాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కిరణ్, కుమార్, ధనుంజయ్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.


