నేడు ఓలేరులో వారాహి మహా హోమం | - | Sakshi
Sakshi News home page

నేడు ఓలేరులో వారాహి మహా హోమం

Jul 23 2026 1:48 AM | Updated on Jul 23 2026 1:48 AM

నేడు ఓలేరులో వారాహి మహా హోమం శ్రీ వారాహి అమ్మవారికి సారె సమర్పణ నేటి నుంచి వరుణుడి కరుణ కోసం పూజలు టెట్‌ మోడల్‌ టెస్ట్‌ పేపర్ల ఆవిష్కరణ

భట్టిప్రోలు: మండల పరిధిలోని ఓలేరు శివానంద ఆశ్రమంలో శ్రీ వారాహి గుప్త నవరాత్ర మహోత్సవంలో భాగంగా బుధవారం బాలాజీ గురుకుల్‌ పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గురువారం మహాహోమం జరుగుతుందని పేర్కొన్నారు. ఉగ్రరూప ధారిణి అయిన అమ్మవారిని చూడటం ఉపాసన బలం ఉన్నవారికి మాత్రమే వీలవుతుందని... అది కూడా అమ్మవారు గ్రామ సంచారానికి వెళ్లినప్పుడు మాత్రమే కుదురుతుందని చెప్పారు. ఈ పూజలో పాల్గొంటే శత్రు బాధలు, దుష్ట శక్తుల పీడలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారని తెలిపారు.

కుంచవరం (తెనాలి): కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో వేంచేసియున్న శ్రీవారాహి అమ్మవారి ఆలయంలో గుప్త నవరాత్రులు బుధవారం ఎనిమిదో రోజుకు చేరాయి. తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, ప్రత్యేక పూజలను పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి పర్యవేక్షణలో నిర్వహించారు. ఉదయం హోమాలు, సాయంత్రం కుంకుమపూజ చేశారు. చక్రాయపాలెంకు చెందిన పసుపులేటి మాణిక్యాలరావు, సావిత్రి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశాక, సారె సమర్పించారు. ఆలయ ధర్మకర్త తన్నీరు శ్రీనివాసబాబు, నాగమల్లేశ్వరి దంపతులు నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో ఎస్‌వీ యోగా కన్వీనర్‌ ముద్దాభక్తుని రమణయ్య, భరత్‌స్వామి, హేమంత్‌కుమార్‌, జెట్టి వెంకట సాయితేజ, భక్తులు పాల్గొన్నారు.

మంగళగిరి టౌన్‌: ప్రజలను కరుణించాలని వరుణుడిని కోరుతూ మంగళగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్ధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ కోగంటి సునీల్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, లోక కల్యాణార్థం సమృద్ధిగా వర్షాలు కురవాలని, కరువు పరిస్థితులు తొలగిపోవాలని 23 నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: యూటీఎఫ్‌ టెట్‌ మోడల్‌ టెస్ట్‌ పేపర్లను డీఈఓ షేక్‌ సలీమ్‌ బాషా బుధవారం డీఈవో కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ యూటీఎఫ్‌ తయారు చేసిన టెస్ట్‌ పేపర్లు ఇన్‌స్టెంట్‌గా చదువుకుని, ఉత్తీర్ణులయ్యేందుకు అనువుగా ఉన్నాయని అన్నారు. యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్‌ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ 1ఏ, 2ఏలో తెలుగు, ఇంగ్లిషు, హిందీ, మాథ్స్‌, సోషల్‌ విడివిడిగా టెస్ట్‌ పేపర్లను పుస్తకాల రూపంలో అందుబాటులో తెచ్చామన్నారు. గతంలో జరిగిన ప్రశ్నపత్రాలు, ప్రాక్టీస్‌ కోసం అదనంగా మరికొన్ని మోడల్‌ పేపర్లను కలిపి పుస్తకాలను రూపొందించామని తెలిపారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజ శేఖరరావు, ఎం.కళాధర్‌లు మాట్లాడుతూ మోడల్‌ టెస్ట్‌ పేపర్లు కావలసిన వారు బ్రాడిపేట 2/6లోని యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో సంఘ జిల్లా సహాధ్యక్షుడు జి. వెంకటేశ్వర్లు, జిల్లా సహాధ్యక్షురాలు ఎండీ షకీలా బేగం, జిల్లా కార్యదర్శులు ఎం. గోవిందయ్య, కె.రంగారావు, బి.ప్రసాద్‌, ఎం.కోటిరెడ్డి, గఫార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement