అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యం రాత్రిళ్లు దందా ... అడ్డుకునే వారికి బెదిరింపులు డబ్బుతో కొంటా ... లేదంటే ఏం చేయాలో తెలుసునని బీరాలు అర్ధరాత్రి రేషన్ బియ్యం అక్రమ తరలింపు వెలుగులోకి సమాచారం ఇచ్చినా స్పందించని పోలీసులు ఓ వ్యక్తి తీసిన ఫొటోలను డిలీట్ చేయించిన నల్లబజారు వ్యాపారి
న్యూస్రీల్
నెలకు 10వేల బస్తాలు నల్లబజారుకు తరలింపు...
శుక్రవారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2026
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8,400, గరిష్ట ధర రూ.9,500, మోడల్ ధర రూ.9,000 వరకు పలికింది.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ మట్టం గురువారం 537.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,172 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
చీరాల అర్బన్: చీరాల నియోజకవర్గంలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. దివ్యాద్రి అనే వ్యక్తి చీరాల నుంచి రేషన్ బియ్యాన్ని నల్లబ బజారుకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది బహిరంగ రహస్యం. ఇటీవల తమకు డబ్బులు వద్దు.. బియ్యం ఇవ్వండని పలువురు మహిళలు ఆందోళనకు దిగటం, పలు రేషన్ షాపుల్లో రిజిస్టర్లోని స్టాకు కన్నా అదనంగా బియ్యం నిల్వలు ఉండటం అందుకు నిదర్శనం. అందుకు కీలక నేత, యువనేతల అండే కారణమని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో సదరు నల్లబజారు వ్యాపారి ఎక్కడన్నా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే డబ్బుతో కొంటా లేదంటే ఎమ్మెల్యే ఆంతరింగికుడితో చెప్పిస్తా అని బీరాలు పోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రేషన్ బియ్యం అక్రమ తరలింపు
బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఓ రేషన్ షాపు నుంచి రేషన్ బియ్యాన్ని మినీ వ్యాన్లోకి ఎక్కిస్తున్నారు. దీన్ని ఓ వ్యక్తి గమనించాడు. ఫొటోలు, వీడియోలు తీశాడు. వ్యాన్ డ్రైవర్, లోడింగ్ కూలీలు అంతా ఫొటోలు తీయవద్దని అతడిని వారించారు. దీంతో ఆ వ్యక్తి ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసుల కంటే ముందే వచ్చిన నల్లబజారు వ్యాపారి
ఈ క్రమంలో పోలీసుల కంటే ముందు నల్లబజారు వ్యాపారి ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. సదరు వ్యక్తితో వాదనకు దిగాడు. ఫోన్లో తీసిన ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయాలని వాదనకు దిగాడు. పోలీస్ సహాయం కోసం ఎదురు చూస్తున్న ఆ వ్యక్తికి నిరాశే మిగిలింది. ఈ లోపు ఎమ్మెల్యే ఆంతరింగికుడితో మాట్లాడు అంటూ నల్లబజారు వ్యాపారి తన ఫోన్ను ఆ వ్యక్తికి ఇవ్వబోయాడు. చివరకు ఆ వ్యక్తి తన ఫోన్లో తీసిన ఫొటోలు, వీడియోలు డిలీట్ చేశాడు. నల్లబజారు వ్యాపారి ఇదే అదునుగా సరుకుతో సహా వాహనాన్ని పంపించి వేశాడు. అయితే అంతకు ముందే కొందరికి ఆ ఫొటోలను, వీడియోలను పంపినట్లు సమాచారం.
చీరాల టు చిలకలూరిపేట
నల్లబజారు వ్యాపారి రూటు మార్చాడు. ప్రస్తుతం రేషన్ బియ్యం చీరాల నుంచి చిలకలూరిపేటకు తరలుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డీలర్లు.. కార్డుదారుల నుంచి కిలో రూ.10 నుంచి రూ.12 ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. కొందరు డబ్బు తీసుకోకుండానే వేలిముద్రలు వేస్తున్నారు. డీలర్లు అలా సేకరించిన బియ్యాన్ని అతనికి విక్రయిస్తారు. డీలర్లకు కిలోకి రూ.14 ఇచ్చి కొనుగోలు చేస్తాడు. చిలకలూరిపేటలో అదే బియ్యం కిలో రూ.24కు విక్రయిస్తాడని ప్రచారం జరుగుతోంది. కిలోకి రూ.10 ఆదాయం అని చెప్పుకుంటున్నారు.
రవాణాకు సిద్ధంగా వాహనం
7
చీరాల నియోజకవర్గం నుంచి నెలకు సుమారు 10వేల బస్తాల రేషన్ బియ్యం నల్లబజారుకు తరలుతున్నాయి. బస్తాకు 50 కిలోల చొప్పున 10 వేల బస్తాలకు 5 లక్షల కిలోలు. కిలోకి రూ.10 లాభం చొప్పున విక్రయించగా వచ్చే మొత్తం రూ.50 లక్షలు. అందులో కీలక నేత, యువ నేతలకు రూ.20 లక్షలు. తన దందాకు అడ్డంకులు లేకుండా ఉండేందుకు సంబంధీకులను సంతృప్తి పరిచేందుకు, రవాణా, ఇతర ఖర్చులు వెరసి సుమారు రూ.16 లక్షలు. నికరాదాయంగా చెప్పుకునేది నెలకు రూ.14లక్షలుగా ఉంటుందని నల్లబజారు వ్యాపారులు, పలువురు డీలర్లతో పాటు విషయం తెలిసిన వారు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్, జేసీ, విజిలెన్స్, పోలీస్, సివిల్సప్లయిస్ తదితర శాఖల్లోని ఉన్నతాధికారులు దృష్టి సారించి రేషన్ బియ్యం నల్లబజారుకు తరలకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


