కోర్టు ఉత్తర్వుల అనంతరం ఆక్రమణలపై నిర్ణయం
రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి
కొల్లూరు: భూ ఆక్రమణలపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలపై రేపల్లె ఆర్డీఓ ఎన్.రామలక్ష్మి విచారణ నిర్వహించారు. కొల్లూరు కేటీ కాలనీ మార్గంలో ఇరువురు రైతులు బావి పోరంబోకు భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటున్నారని అందిన అర్జీతోపాటు, అదే ప్రాంతంలో కాలినడక మార్గాన్ని బళ్లగాడుగా విస్తరించడంపై అందిన అర్జీలపై బుధవారం విచారించారు. రెవెన్యు రికార్డులను పరిశీలించిన ఆర్డీఓ రికార్డుల ప్రకారం కాలినడక మార్గమే ఉందని మిగిలిన భూమి బోధి కాలువ కింద చూపిస్తుందన్నారు. అయితే ఇరు భూ సమస్యలపై కోర్టులో కేసు నడుస్తున్నందున కోర్టు తీర్పు అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఆమె కొల్లూరు గౌడపాలెంలో గతంలో బహిరంగ మల విసర్జనకు వినియోగించిన స్థలాన్ని ప్రభుత్వ పెట్రోల్ బంక్కు కేటాయించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఆమె వెంట కొల్లూరు తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు, మండల సర్వేయర్ హర్షవర్ధన్, వీఆర్ఓలు ఉన్నారు.
రైల్వే క్రికెట్ జట్టుకు మార్గదర్శిగా సీనియర్ డీసీఎం ప్రదీప్
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): భారతీయ రైల్వే సీనియర్ పురుషుల క్రికెట్ జట్టుకు మార్గదర్శిగా ఐఆర్సీటీసీ అధికారి, గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం డాక్టర్ ప్రదీప్ చిలుకను బుధవారం రైల్వే స్పోర్ట్ ప్రమోషన్స్ బోర్డు నియమించారు. ఈ నియామకం విజయ్ హజారే ట్రోఫీ 2025లో భారతీయ రైల్వే క్రికెట్ జట్టు పాల్గొనే కాలాన్ని కవర్ చేస్తుంది. డిసెంబర్ 16 నుంచి 23వ తేదీ వరకు బెంగళూరులోని రైల్ వీల్ స్పోర్ట్స్ అసోసియేషన్లో నిర్వహించనున్న ఫ్రీ పార్టిసిపేషన్ కోచింగ్ క్యాంప్ను పర్యవేక్షిస్తారు. అనంతరం బెంగళూరులోనే జరగనున్న లీగ్ దశ పోటీల్లో జట్టుకు మార్గదర్శకం వహిస్తారు. ఈ టోర్నమెంట్ జనవరి 2026తో ముగియనుంది. ప్రదీప్కుమార్ను అధికారులు అభినందిచారు.
సావిత్రి భాయి పూలే అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
నెహ్రూనగర్: సావిత్రి భాయి పూలే అవార్డు –2026 ప్రదానం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.శ్రీనివాసులు బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. సావిత్రి భాయ్ పూలే 95వ జయంతి సందర్భంగా బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా, నగర శాఖల ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న బీసీ మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయుల, వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. గత పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందని ఈ అవార్డు కోసం ఈ నెల 25వ తేదీలోగా 8985618861, 9440536495 వాట్సాప్ నంబర్లకు బయోడేటా పంపాలని సూచించారు.
ఆటో బోల్తా .. ఒకరి మృతి
నలుగురికి స్వల్ప గాయాలు
మాచవరం: అతివేగంగా వెళుతున్న ఆటో బోల్తా కొట్టడంతో ఒకరు మృతి చెందగా, నలుగురికి స్వల్ప గాయాలైన ఘటన మండలంలోని గంగిరెడ్డిపాలెం గ్రామం వద్ద చోటు చేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం పిడుగురాళ్ల మండలం కొత్త వెల్లంపల్లి గ్రామానికి చెందిన కొందరు కూలి పనులు నిమిత్తం మండలంలోని వేమవరం గ్రామానికి ఆటోలో బయలుదేరారు. గంగిరెడ్డిపాలెం గ్రామ సమీపానికి రాగానే ఆటో అతివేగంగా ప్రయాణిస్తూ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న చెడపొంగు గురవయ్య (65) కు తీవ్ర గాయాలుగా హాస్పిటల్ కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలు కాగా మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జాతీయస్థాయి ఫెన్సింగ్
చాంపియన్షిప్కు నిహాల్ ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: మణిపూర్లో జనవరి 4వ తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి ఫెన్సింగ్ చాంపియన్షిప్నకు శ్రీచైతన్య జూనియర్ కళాశాల సీనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థి దానియేలు నిహాల్ ఎంపికై నట్లు విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్ తెలిపారు. బుధవారం లక్ష్మీపురంలోని కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దుర్గాప్రసాద్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడారంగంలో విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పెదకాకాని మండలం వెనిగండ్ల జెడ్పీ హైస్కూల్లో జరిగిన అండర్–19 రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని సాధించిన తమ విద్యార్థి దానియేలు నిహాల్ జాతీయస్థాయికి అర్హత సాధించాడని తెలిపారు. ఈసందర్భంగా నిహాల్ను అభినందించారు.
కోర్టు ఉత్తర్వుల అనంతరం ఆక్రమణలపై నిర్ణయం


