మిరపకాయల దొంగకు జైలు శిక్ష
అద్దంకి రూరల్: పొలంలో ఆరబోసిన ఎండు మిరపకాయలను దొంగిలించిన కేసులో సోమవారం అద్దంకి కోర్టులో విచారణ జరగ్గా న్యాయమూర్తి బి.అఖిల నిందుతుడికి ఆరునెలల జైలు శిక్ష విధించారు. సీఐ సుబ్బరాజు తెలిపిన వివరాల మేరకు.. అద్దంకి మండలం రాళ్లపాడు గ్రామంలో డి. శ్రీనివాసరావు పొలంలో ఎండుమిర్చిని ఆరబోశాడు. ఎవరో గుర్తు తెలియని దొంగలు రూ. 1.50 లక్షల విలువ చేసే మిరపకాయలను ఫిబ్రవరి 7న రాత్రి దొంగిలించారని అద్దంకి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అద్దంకి సీఐ సుబ్బరాజు, అప్పటి ఎస్సై ఖాదర్బాషా కేసు రిజిస్టర్ చేసి కేసు దర్యాప్తు చేశారు. నిందితుడు సంతనూతలపాడు మండలం పేర్నమిట్టకు చెందిన చిరుతోటి మధును అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన టాటా ఏసీ ఆటోను, మిర్చిని స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగించి చార్జ్ షీట్ ఫైల్ చేశారు. కేసు విచారణలో భాగంగా నిందితుడిని ఒంగోలు జైలు నుంచి అద్దంకి కోర్టుకు హాజరు పరిచారు. నిందితుడు నేరం అంగీకరించినందుకు న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు.
18 నుంచి రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు
గుంటూరు వెస్ట్: రాష్ట్ర స్థాయి యువజనోత్సవం, ఆంధ్ర యువ సంకల్ప్–2కే25 కార్యక్రమాన్ని ఈ నెల 18,19, 20వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రవాణా, యువజన సేవలు, క్రీడల శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి ప్రారంభిస్తారన్నారు. మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు.
దాడికేసులో వ్యక్తి అరెస్టు
తాడికొండ: 2023లో జరిగిన కేసులో మంగళగిరి మండలం చినకాకానికి చెందిన లోకేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన తుళ్ళూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదివారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు సోమవారం అరెస్టు చూపి రిమాండ్కు తరలించారు. 2023లో మూడు రాజధానుల శిబిరం వద్ద జరిగిన దాడిలో నిందితుడుగా ఉన్న కొలకలూరి లోకేష్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తుళ్ళూరు పోలీసులు తెలిపారు.
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణం నాంచారమ్మ ప్రాంగణంలో ఉన్న శ్రీ భద్రావతి సమేత భావనా ఋషి స్వామివార్ల దేవాలయంలో సోమవారం పల్నాడు జిల్లా రెంటచింతల మండలం సత్రశాల శ్రీ భక్తమార్కండేయ పద్మశాలీ అన్నదాన సేవా సంఘం కమిటీ ముద్రించిన 2026 క్యాలెండర్ను అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పండుగ వేళల్లో ధార్మిక సత్రాల ద్వారా భక్తులకు సేవలు చేసే భాగ్యం రావడం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో అన్నదాన సేవా సంఘం గౌరవ అధ్యక్షులు చిన్నవీరయ్య, మాజీ కౌన్సిలర్ బట్టు సదానంద శాస్త్రి, సత్రం అధ్యక్షులు వెంకట కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
సాగర్లో ఆక్టోపస్ మాక్ డ్రిల్
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో సోమవారం ఆక్టోపస్ దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఇటీవల కాలంలో దేశంలోని ప్రముఖ ప్రదేశాలలో ఉగ్రవాద మూకల కదలికల దృష్ట్యా ఆక్టోపస్ దళాలు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా ఆక్టోపస్ దళాల డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సాగర్లోని ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పరిసర ప్రాంతాలు, పవర్ హౌస్ లోపలి భాగంలో ఉగ్రవాదులు చొరబడితే అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏవిధంగా స్పందించాలి, ఆక్టోపస్ బలగాలకు సమాచారం అందిన వెంటనే బలగాలు ఏవిధంగా ఎదుర్కోవాలి, ఎటువంటి ప్రత్యేక కోడ్లతో ఆపరేషన్ నిర్వహించాలనే అనే విషయంలో సంఘటన జరుగుతున్నట్లుగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ విధంగానే నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ పరిసర ప్రాంతాలలో ఉగ్రవాదుల సంచారం, ఉగ్రవాదులు డ్యామ్పైకి ప్రవేశించే సందర్భాలలో, సాగర్ డ్యాం పరిధిలోని సున్నితమైన విభాగాలలో ఉగ్రదాడిని ఎదుర్కొనే సంఘటనలను ఆక్టోపస్ దళాలు డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదులను ఎదుర్కొనే సందర్భంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్సులు, మంటలు చెలరేగితే ఆపటానికి అగ్నిమాపక వాహనాలు నిజంగానే ఉగ్రవాదులను ఆక్టోపస్ దళాలు ఎదుర్కొంటున్నట్టుగా వ్యవహరించారు. మాక్ డ్రిల్ లో ఎస్పీఎఫ్ ఉన్నత అధికారులు, తెలంగాణ పోలీస్ అధికారులు, సీఆర్పీఎఫ్ దళాలు, ఎస్పీఎఫ్ దళాలు పాల్గొన్నాయి.
మిరపకాయల దొంగకు జైలు శిక్ష


