వరద ఉధృతం | - | Sakshi
Sakshi News home page

వరద ఉధృతం

Aug 15 2025 7:06 AM | Updated on Aug 15 2025 7:06 AM

వరద ఉ

వరద ఉధృతం

వరద ఉధృతం లోతట్టు ప్రాంతాలకు పొంచి ఉన్న ప్రమాదం భట్టిప్రోలు: ప్రకాశం బ్యారేజ్‌ నుంచి సముద్రంలోకి విడుదల చేస్తున్న వరద నీటి కారణంగా కృష్ణానదీ పరీవాహక లంక గ్రామాల్లో కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో సాగు చేసిన వాణిజ్య పంటలు నీట మునిగే ప్రమాదం ఉంది. దీంతో రైతులు అప్రమత్తమయ్యారు. పెదపులివర్రు–పెసర్లంక, ఓలేరు–పెసర్లంక, కోళ్లపాలెం–పెసర్లంక చప్టాల వద్ద నీరు చేరింది. దీంతో ఆయా మార్గాల్లో తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి. రేవు వద్ద వరద నీరు ఉదయం 15 అడుగుల మేర ప్రవహించగా సాయంత్రం మరింత పెరిగింది. లంక గ్రామాల వాసులు వెల్లటూరు చినరేవు హైలెవల్‌ వంతెన మీదుగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రేవులోకి వెళ్ల వద్దని భట్టిప్రోలు మండల తహసీల్దార్‌ మేకా శ్రీనివాసరావు లంక గ్రామాల ప్రజలకు సూచించారు. ఓలేరు పల్లెపాలెం, కాకులడొంక రేవు వద్ద పరిస్థితిని తహసీల్దార్‌తో పాటు వీఆర్వోలు పరిశీలించారు. దిగువకు 5.65 లక్షల క్యూసెక్కులు విడుదల ప్రకాశం బ్యారేజ్‌ నుంచి ఉదయం 5.65 లక్షల క్యూసెక్కుల విడుదల చేశారు. దిగువకు నీరు విడుదల కావడంతో నదీ పరీవాహక ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండేలా రెవెన్యూ శాఖతో పాటు పోలీస్‌, పంచాయతీరాజ్‌, అగ్నిమాపక దళం, ఆర్‌సీ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బోట్లు, ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచారు. సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారాన్ని మండల రెవెన్యూ అధికారులకు తెలియజేస్తూ అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ కోరారు. చాటింపు ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రజలు చప్టాలు, రేవులు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. వ్యవసాయ పనుల నిమిత్తం నదిలోకి వెళ్లకుండా పశువులు, గొర్రెలు, మేకలు తోలుకుని జాగ్రత్త పడాలని సూచించారు. భట్టిప్రోలు మండలంలో నదిని ఆనుకుని ఉన్న గ్రామాలైన ఓలేరు, పల్లెపాలెం, పెదలంక, పెసర్లంక, చింతమోటు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆయా ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. పరిస్ధితిని వీఆర్వోలు రెవిన్యూ సిబ్బంది వివిధ శాఖల అధికారులు,సచివాలయ సిబ్బంది సమీక్షించారు. కరకట్టల పటిష్టతకు చర్యలు కరకట్టలు బలహీనంగా ఉన్న ప్రాంతాలలో మరమ్మతులు నిర్వహించి ఇసుక బస్తాలను ఇప్పటికే సిద్ధం చేశారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున రైతులు మోటార్లను ఊడదీసి సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. ఆర్‌సీ ఏఈ కె.నాగేశ్వర నాయక్‌ సిబ్బంది ముందస్తు జాగ్రత్తగా కరకట్టకు గండ్లు పడే ప్రమా దం ఉన్న ప్రాంతాలను గుర్తించి పటిష్టం చేయడమే కాక ఇసుక మూటలను సిద్ధం చేశారు. ప్రజలు అప్రమత్తంగా అధికారులకు సహకరించాలని కోరారు.

రేపల్లె: ప్రకాశం బ్యారేజి నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో లంక గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ మోర్ల శ్రీనివాసరావు హెచ్చరించారు. గురువారం ఆయన పెనుమూడి వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. అనంతరం వరద ప్రభావిత గ్రామాలైన పెనుమూడి, పెనుమూడి పల్లిపాలెం, రావి అనంతవరంలలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. వరద ఉధృతి పెరిగితే ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలన్నారు. ముంపు ప్రాంతాలలో ముందస్తు చర్యలో భాగంగా పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, వైద్య సేవలు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టామన్నారు. గురువారం 12 గంటల సమయంలో ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 5.52 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు. రేపల్లె తహసీల్దార్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. కంట్రోల్‌ రూమ్‌ 24 గంటలు పనిచేస్తుందన్నారు. ఏదైనా సహాయం కోసం 77 94 89 45 44 నంబరులో సంప్రదించాలని తెలిపారు. ఆయన వెంట వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.

రైతుల్లో కలవరం

భట్టిప్రోలు: కృష్ణా నదిలో వరద ఉధృతి పెరుగుతుండడంతో లంక గ్రామాల రైతులు కలవరపడుతున్నారు. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి దిగువకు గురువారం ఉదయం 3.97 లక్షలు, సాయంత్రం 5.65 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పెదపులివర్రు, గొరిగపూడి, రేపల్లె ప్రాంతాలకు చెందిన రైతులు పసుపు, కంద, మొక్కజొన్న, కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. వరద ఉధృతికి పంటలు దెబ్బతినే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పరిస్థితిని తహసీల్డార్‌ మేకా శ్రీవాసరావు, డెప్యూటీ తహసీల్డార్‌ శాంతకుమారి, ఎంపీడీవో ఎస్‌వీ రమణ, ఇన్‌చార్జి ఆర్‌ఐ శివరామకృష్ణ ఆధ్వర్యంలో వీఆర్వోలు మండ్రు జక్రయ్య, ఎల్‌.సురేష్‌, రాంబాబు, పంచాయతీ సిబ్బంది, వీఆర్‌ఏలు సమీక్షిస్తున్నారు.

లంక గ్రామాల ప్రజలను వరద భయం వెంటాడుతోంది. గురువారం ఉదయం ప్రకాశం బ్యారేజ్‌ నుంచి ఐదు లక్షల క్యూసెక్కులు విడుదల చేయడంతో వరద నీరు గ్రామాల్లోకి చొచ్చుకువస్తుంది. పంట పొలాలు కోతకు గురవుతున్నాయి. పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మునగ, దొండ, బొప్పాయి పంటలు నీటిలో నానుతున్నాయి. ఇటుక బట్టీలు నీట మునిగాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

లంక గ్రామాల ప్రజలను

అప్రమత్తం చేస్తున్న అధికారులు

అందుబాటులో బోట్లు, గజ ఈతగాళ్లు

కొల్లూరు: కృష్ణా నదిలో వరద ఉధృతి పెరగడంతో లంక గ్రామాల ప్రజలను వరద భయం పట్టి పీడిస్తుంది. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి దిగువకు గురువారం 5 లక్షల 65 వేల 201 క్యూసెక్కులు విడుదల చేశారు. గాజుల్లంక చినరేవు నుంచి వచ్చిన వరద నీరు మండలంలోని దోనేపూడి కరకట్ట దిగువున ఉన్న లో లెవల్‌ వంతెన పైనుంచి ప్రవహిస్తుండటంతో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోతార్లంక, తిప్పలకట్ట, తోకలవారిపాలెం, కిష్కింధపాలెం, జువ్వలపాలెం, తడికలపూడి గ్రామాలకు చెందిన ప్రజలు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం వీరు భట్టిప్రోలు మండలం వెల్లటూరు, కొల్లూరు మండలం గాజుల్లంక మీదు గా చుట్టూ తిరిగి ప్రయాణం సాగిస్తున్నారు. అరవింద వారధి సమీపంలోని నక్కపాయ గండి, ఆవులవారిపాలెం శివారు క్రీస్తులంక సమీపంలోని గండి, గాజుల్లంక గ్రామం వెంబడి నది గట్టుకు గండ్లు ఏర్పడ్డాయి. వరద నీరు ఇటుకరాయి మట్టి కోసం తవ్విన గుంతల్లోకి చొచ్చుకొని రావడంతో ఆ మూడు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. మండలంలోని చింతర్లంకలో నది అంచున ఉన్న లోతట్టు పంట భూముల్లోకి వరద నీరు చేరడంతో అరటి, కంద, పసుపు, కూరగాయల పంటలు ముంపు బారిన పడ్డాయి. పోతార్లంక –గాజుల్లంక గ్రామాల నడుమ కంద, అరటి, పసుపు, కూరగాయల పంటలను వరద ముంచెత్తింది. కొల్లూరు, పెసర్లంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక గ్రామాల పరిధిలో ఉన్న ఇటుక బట్టీలు నీట మునిగాయి.

వరద ఉధృతం 1
1/4

వరద ఉధృతం

వరద ఉధృతం 2
2/4

వరద ఉధృతం

వరద ఉధృతం 3
3/4

వరద ఉధృతం

వరద ఉధృతం 4
4/4

వరద ఉధృతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement