మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు హేయం
సత్తెనపల్లి:బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు హేయమైన చర్య అని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు చిలుకా జయపాల్ ఆదివారం ఖండించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తప్పుడు కేసులతో దళిత నాయకుడు, మాజీ ఎంపీ నందిగం సురేష్ను పలు రకాలుగా వేధింపులకు గురి చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే ఒకసారి అరెస్ట్ చేశారని, అది చాలదన్నట్లు ఇప్పుడు తాజాగా టీడీపీ కార్యకర్త తప్పుడు ఫిర్యాదుతో మరోసారి అరెస్ట్ చేశారని తెలిపారు. సురేష్ ఇంటి వద్ద రాజు అనే టీడీపీ కార్యకర్త హల్చల్ చేసి కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషించాడని, కార్లను ధ్వంసం చేసి వీరంగం సృష్టించినా కనీసం పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. కానీ హల్చల్ చేసిన టీడీపీ కార్యకర్త రాజు ఇచ్చిన ఫిర్యాదుతో సురేష్ను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీకో న్యాయం.. వైఎస్సార్ సీపీకో న్యాయమా? అని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రహించాలని జయపాల్ పేర్కొన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీరు దళితుల పైన చూపిస్తున్న ప్రేమ ? అంటూ మండిపడ్డారు. ఇప్పటికై నా అక్రమ అరెస్ట్లు మానుకోకపోతే ప్రజలే భవిష్యత్తులో తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
గుంటూరులో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు
లక్ష్మీపురం: ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర మహాసభలు గుంటూరులో జులై 23, 24 తేదీల్లో నిర్వహించనునట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వీ నరసింహారావు చెప్పారు. పాత గుంటూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం బి.సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. ఇప్పటికై నా సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. గుంటూరులో జరుగుతున్న రాష్ట్ర మహాసభకు మేస్త్రిలు, బిల్డర్స్, కాంట్రాక్టర్స్ సహాయ సహకారాలు అందించాలని కోరారు. యూనియన్ జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భవన నిర్మాణాలకు ఆటంకంగా ఉన్న, లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ ఉద్యోగ భద్రతకు ప్రమాదకరంగా ఉన్న జీవో నంబర్ 20ని రద్దు చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి. లక్ష్మణరావు, నాయకులు కె. శ్రీనివాసరావు, బి. ముత్యాలు, పి. దీవెనరావు, బాబూరావు, డి కోటేశ్వరరావు, ఖాసీం వలి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
బదిలీల నుంచి మినహాయించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: 60 ఏళ్ల వయసుకు చేరువలో ఉన్న ఉపాధ్యాయులను బదిలీల నుంచి మినహాయించాలని వైఎస్సార్ సీపీ ఉద్యోగ, పెన్షనర్ల విభాగ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ సత్యనారాయణ ఆదివారం ఓప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. 2017 ఆగస్టులో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో స్థాన చలనం పొందిన వారిని ప్రస్తుత బదిలీల్లో లాంగ్ స్టాండింగ్ విభాగంలో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి కాకుండా, అకడమిక్ ఇయర్స్ ప్రాతిపదికగా మే 31 నాటికి లాంగ్ స్టాండింగ్గా పరిగణించి బదిలీల్లో చేర్చుతున్నారని తెలిపారు. కేలండర్ ఇయర్స్ కాకుండా విద్యా సంవత్సరాల ప్రాతిపదికన బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా 60 ఏళ్ల వయసు పైబడిన ఉపాధ్యాయులు సైతం బదిలీల్లో స్థాన చలనం పొందనున్నారని, ఇది వారికి తీవ్ర అన్యాయం కలిగించే విషయమన్నారు. ఒక అకడమిక్ ఇయర్లో 9 నెలలు పనిచేస్తే ఒక ఏడాదిగా పరిగణిస్తున్న విద్యాశాఖాధికారులు, 59 ఏళ్ల 10 నెలలు వయస్సు నిండిన వారిని 60 ఏళ్ల వయసు నిండిన వారితో సమానంగా పరిగణించకపోవడంతో అనేకమంది ఉపాధ్యాయులు మానసికంగా ఆవేదన చెందుతున్నారని అన్నారు. 60 ఏళ్లకు చేరువలో ఉన్న వయోధిక ఉపాధ్యాయుల వయసు, అనారోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకుని వారిని బదిలీల నుంచి మినహాయించాలని కోరారు. ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు హేయం


