● హెల్మెంట్లు ధరించిన దొంగలు
● డబ్బు, బంగారు ఆభరణాలు అపహరణ
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె బసినికొండ గంగమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. మంగళవారం వేకువజామున హెల్మెట్లు ధరించి వచ్చిన దొంగలు ఆలయ ఇనుప తలుపులను ధ్వంసం చేసి లోపలికి చొరబడ్డారు. అనంతరం హుండీని పగలగొట్టి అందులోని నగదుతోపాటు అమ్మవారి బంగారు ఆభరణాలను అపహరించుకుని హెల్మెంట్లు అక్కడే పడేసి పరారయ్యారు. మంగళవారం ఉదయం ఆలయంలో చోరీ జరిగిన విషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు హుటాహుటిన బసినికొండకు చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించి స్థానికులను విచారణ చేసి వివరాలు సేకరించారు. ఆలయంలోని హుండీ, తలుపులు ధ్వంసమైన తీరును పరిశీలించిన పోలీసులు ఆధారాల కోసం ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చోరీకి గురైన బంగారు ఆభరణాలు, నగదు విలువ ఎంత? ఎంత మంది దొంగలు వచ్చారు? అనే వివరాలను పోలీసులు సీపీ కెమెరాలను పరిశీలించిన అనంతరం వెల్లడించాల్సి ఉంది.


