కలికిరి: వాల్మీకిపురం మండలం తాటిగుంటపల్లి పంచాయతీ పరిధిలోని తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారి పక్కన గల ఏపీఐఐసీ భూము లను కలెక్టరు నిశాంత్కుమార్, స్థానిక ఎమ్మెల్యే కిశోర్కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఇక్కడ ఉన్న 1200 ఎకరాల ఏపీఐఐసీ భూముల్లో, లేఔట్ల ఏర్పాటు తర్వాత ఇంకా 600 ఎకరాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. ఖాళీగా ఉన్న భూముల్లో పరిశ్రమల స్థాపనకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలికిరిలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలకు జూనియర్ కళాశాల మంజూరైన నేపథ్యంలో.. సీఎల్ఆర్సీ కేంద్రంలో జరుగుతున్న కళాశాల మరమ్మతు పనులను వారు తనిఖీ చేశారు. కలికిరి పెద్దచెరువును సందర్శించిన కలెక్టర్ నీటి నిల్వ సామర్థ్యం, క్యాస్కేడ్ అభివృద్ధి, ఆయకట్టు విస్తీర్ణం వివరాలను ఇరిగేషన్ ఏఈ శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. అనంతరం తుమ్మలపేట వడ్డిపల్లి వద్ద గల దండువాని ఒడ్డు చెరువు కట్ట పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెలఫేర్ ఈఈ కరీముల్లా ఖాన్, ఏఈ రమేష్, తహశీల్దారు సయ్యద్ అహ్మద్, డిప్యూటీ ఎంపీడీఒ రియాజుద్దీన్, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.
నేటి మెగా పీటీఎంకు హాజరుకావాలి
సాక్షి, మదనపల్లె: జిల్లావ్యాప్తంగా శుక్రవారం నిర్వహించనున్న మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (పీటీఎం) సమావేశాలకు తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ హాజరుకావాలని కలెక్టర్ ఒక ప్రకటనలో కోరారు. మొత్తం 2,259 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్న ఆయన, విద్యాశాఖ అధికారులు ఈ మెగా పీటీఎంకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.


