● ప్రకాష్ నగర్లో 2.10 ఎకరాలు
ఆక్రమించేందుకు యత్నం
● బాధితుడు అంబవరం సహదేవరెడ్డి
ఆరోపణ
కడప కార్పొరేషన్ : అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అక్రమణలకు పాల్పడుతున్నారని కడప నగరానికి చెందిన అంబవరం సహదేవరెడ్డి ఆరోపించారు. శనివారం వివాద స్థలం వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ కడప నగరంలో చిన్నచౌకు గ్రామ పొలంలో సర్వే నంబర్ 9.8 నందు 22.50 ఎకరాల భూమిపై కుటుంబ సభ్యుల మధ్య వివాదం నడుస్తోందన్నారు. ఇందులో కోర్టు 4.20 ఎకరాలను సబ్ డివిజన్ చేసి 1ఏ, 2బీగా నిర్ణయించి, నాకు, మా అన్నదమ్ములకు చెరి సగం పంచుకోవాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ ఆస్తిపై ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య కన్నేసి కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ భూమి రూ.30కోట్ల విలువ చేస్తుందని, అందువల్ల తనపై, తన కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి, బెదిరింపులకు పాల్పడుతూ మానసికంగా వేధిస్తున్నారన్నారు. 2006 సంవత్సరం నుంచి 2018 వరకు ఈ కేసు కోర్టులో నడిచి తీర్పు వచ్చిందన్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మాకు సంబంధించిన 2.10 ఎకరాల భూమిలో రోడ్డు, ప్లాట్లు వేసి దౌర్జన్యంగా కబ్జా చేయాలని చూస్తున్నారన్నారు. అందులో ఉన్న తమ చిన్నాన్న ఏ. రామక్రిష్ణారెడ్డి సమాధిని కూడా కూల్చివేశారన్నారు. దీనిపై జిల్లా ఎస్పీకి, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదన్నారు. 2018లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎమ్మెల్సీ తన వారసులతో హైకోర్టులో అప్పీలు చేశారని కోర్టు దానిని డిస్మిస్ చేసిందన్నారు. ఎమ్మెల్సీ దౌర్జన్యాన్ని తాము అడ్డుకోగా తమపై చిన్నచౌకు పోలీస్స్టేషన్లో తప్పుడు ఫిర్యాదు చేయించి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారన్నారు. అది తప్పుడు ఫిర్యాదు అని పోలీసులు రెఫర్ చేశారన్నారు.


