
రాజకీయ సంప్రదాయాన్ని మంటగలిపారు
ఒంటిమిట్ట: ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తులు ఏదేని కారణం చేత చనిపోతే వారి స్థానంలో కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం రాజకీయ సంప్రదాయం. అలాంటి సంప్రదా యాన్ని పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక విషయానికి వచ్చే సరికి టీడీపీ మంటగలిపిందని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చింతరాజుపల్లి, మృకుందాశ్రమం, శ్రీకోదండ రామనగర్ కాలనీ, ఒంటిమిట్ట ఎస్సీకాలనీల్లో అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డితో కలిసి కడప మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి ప్రచారం చేశారు. సాయంత్రం అభ్యర్థితో కలిసి బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, కడప పార్లమెంట్ పరిశీలకులు అజయ్ రెడ్డి సంఘీభావం తెలిపి, ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
● బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మాట్లాడుతూ.. రెండు సార్లు జెడ్పీటీసీ గా గెలిచిన ఇగరంరెడ్డి సుబ్బారెడ్డి ని ముచ్చటగా మూడోసారి గెలిపించాలని ఆమె కోరారు.
● కడప నగర మేయర్, రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు సురేష్బాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడుస్తోంది. ఇంత వరకు వారు చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అలాంటి మోసపూరిత ప్రభుత్వానికి మన బుద్ది చెప్పాలంటే ఈ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉన్నాం అని నిరూపిద్దామన్నారు.
● మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాన్ని నడిపిస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. ఈ ప్రభుత్వాని బద్ధి చెప్పాలంటే ఈ ఉప ఎన్నికలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సుబ్బారెడ్డిని గెలిపించాలని కోరారు.
● ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ...ఈ ఉప ఎన్నికలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అవసరమైతే ప్రాణాలకు తెగించి మన పార్టీ ఉనికిని కాపాడుకోవాలని తెలిపారు.
● ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ..ఆకేపాటి అమరనాథ్రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే అయినందున జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ జెడ్పీటీసీ ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ఈ ఎన్నికలో ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
● రాష్ట్ర అధికార ప్రతినిధి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ కంచు కోట అయిన కడప జిల్లాలోని రెండు జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకోవడానికి టీడీపీ సామవేద దండోపాయాలను ఉపయోగిస్తున్నారని, ఎవరెన్ని పన్నాగాలు పన్నినా ఒంటిమిట్ట, పులివెందుల మండలాలలో వైఎస్సార్సీపీ జెండా పాతడం ఖాయమని ఆయన తెలిపారు.
● మాజీ జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకులు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోరే నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే రాష్ట్ర సుభిక్షంగా ఉంటుందన్నారు.
● రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి మాట్లాడుతూ... పోలీసులు రాజ్యాంగాన్ని గౌరవించి, నిష్పక్షపాతంగా ఈ ఉప ఎన్నికలను నిర్వహించాలని కోరారు.
● కడప పార్లెంట్ పరిశీలకులు అజయ్రెడ్డి మాట్లాడుతూ..ఒంటిమిట్ట మండలంలో ఎవ్వరి నోట విన్నా కూటమి ప్రభుత్వం చేసిన మోసాలే చెబుతున్నారన్నారు. ఈసారి మాత్రం తప్పక వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించుకుంటా మని తెలిపారు.
● వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. గతంలో రెండు సార్లు తనను జెడ్పీటీసీగా గెలిపించారని, ఈసారి కూడా గెలిపించాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్యరెడ్డి, రాజంపేట నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షుడు కూండ్ల ఓబుల్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు రాజమోహన్ నాయుడు, మండల ప్రచార విభాగ అధ్యక్షుడు రాజశేఖర్ రాయల్, రవిరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఒంటిమిట్ట ఉప ఎన్నిక ప్రచారంలో వైఎస్సార్సీపీ నేతలు

రాజకీయ సంప్రదాయాన్ని మంటగలిపారు