ఉగ్రవాదులను బహిరంగంగా ఉరి తీయాలి
రాజంపేట టౌన్ : పహల్గాంలో అభంశుభం తెలియని 28 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను బహిరంగంగా ఉరి తీయలాని పట్టణంలోని ముస్లీం మైనార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల ఉన్మాదాన్ని నిరసిస్తూ, ఉగ్రవాదుల చేతిలో అసువులు బాసిన వారి ఆత్మశాంతి కోసం శనివారం రాత్రి ముస్లీం మైనార్టీ నాయకులు ఆర్అండ్బీ బంగ్లా వద్ద కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముస్లీం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించేందుకు కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతి భారతీయుడు అండగా నిలుస్తాడని తెలిపారు.
ముగ్గురాయిని రాయితీపై మిల్లులకు ఇవ్వాలి
ఓబులవారిపల్లె : మంగంపేట గనుల ఆధారితంగా ఏర్పాటు చేసుకున్న పల్వరైజింగ్ మిల్లులకు ఏపీఎండీసీ యాజమాన్యం రాయితీపై ముగ్గురాయిని సరఫరా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ జోనల్ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మంగంపేట కారుపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్యంమత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 296 జీఓ ప్రకారం మిల్లులకు రాయితీలు కల్పించి ప్రోత్సహించారన్నారు. ప్రస్తుతం ఖనిజ సరఫరా నిలిపివేయడంతో పల్వరైజింగ్ మిల్లులు పూర్తిగా మూతపడ్డాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్థానికంగా ఉన్న మిల్లులకు రాయితీపై ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ ఖనిజాన్ని సరఫరా చేసి ఆదుకోవాలన్నారు.
వృద్ధుడి ఆత్మహత్యాయత్నం
సిద్దవటం : భార్య అనారోగ్యంతో బాధపడుతుంటే తట్టుకోలేని ఓ వృద్ధుడు భార్య కంటే ముందుగా తానే చనిపోవాలని నిర్ధారించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వృద్ధుడిని రైల్వే సిబ్బంది కాపాడారు. వివరాల్లోకి వెళితే.. అట్లూరు మండలం, అట్లూరు క్రాస్ రోడ్డులో నివాసం ఉంటున్న జె. అబ్బిరెడ్డికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. అయితే ఇటీవల భార్య లక్ష్మిదేవి ఆరోగ్యం సరిగా లేనందున ఆమెకు ఏమైనా అవుతుందనే భయంతో, భార్యకంటే ముందుగా తాను చనిపోవాలని భావించాడు. శనివారం సిద్దవటం మండలం కనుమలోపల్లె గ్రామ సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ వద్దకు ఉదయం 8 గంటలకే వచ్చి రైల్వే స్టేషన్లో రైలు కింద పడబోతుండగా రైల్వే సిబ్బంది గమనించి వృద్ధుని ప్రాణాలు కాపాడారు. ఈ విషయాన్ని సిద్దవటం ఎస్ఐ మహమ్మద్ రఫీకి రైల్వే సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదని, వృద్ధురాలికి సరైన వైద్యం చేయించాలని కౌన్సిలింగ్ ఇచ్చి వారి బంధువులకు అప్పగించారు.
గ్రీస్ దేశంలో ఉద్యోగావకాశాలు
రాయచోటి టౌన్ : గ్రీస్ దేశంలో ఉద్యోగావకాశాలు ఉన్నట్లు అన్నమయ్య జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) అధికారి దాసరి నాగార్జున శనివారం ఒక ప్రకటలో తెలిపారు. ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. వివరాల కోసం 988853335, 8712655686, 8790118349, 8790117279లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం మదనపల్లెలో జరిగింది. నీరుగట్టువారిపల్లె రామిరెడ్డి లేఅవుట్కు చెందిన నరసింహులు కుమారుడు మల్లికార్జున(26)కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. అయితే అకస్మాత్తుగా వధువు తరపువారు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెంది నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
రైలు కిందపడి మహిళ మృతి
పుల్లంపేట : మండల పరిధిలోని దేవసముద్రం వడ్డిపల్లికి చెందిన పసుపులేటి సీతమ్మ శనివారం ఉడుమువారిపల్లికి సమీపంలోని రైల్వేట్రాక్పై రైలు కింద పడి మృతి చెందింది. ఆమె మృతి విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై రేణిగుంట రైల్వే పోలీసు గౌరీ శంకర్ కేసు నమోదు చేశారు.
ఉగ్రవాదులను బహిరంగంగా ఉరి తీయాలి
ఉగ్రవాదులను బహిరంగంగా ఉరి తీయాలి


