ప్రత్యేక హోదాపై గళమెత్తుతాం: వైఎస్సార్‌సీపీ ఎంపీలు

YSRCP MPs Press Meet On AP Special Status - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు కోసం పార్లమెంటులో ప్రైవేటు మెంబరు బిల్లు ప్రవేశ పెడతామని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తలారి రంగయ్య, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఎన్‌.రెడ్డప్ప తెలిపారు. వారు ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం( క్లోజ్డ్ చాప్టర్) కాదని, పవిత్రమైన పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ అని ఎంపీలు గుర్తు చేశారు. విభజన హామీలు సాధించుకోవడం కోసం పార్లమెంటులో గళమెత్తుతామని తెలిపారు. 

ప్రత్యేక హోదా అనేది క్లోజ్‌డ్‌ చాఫ్టర్‌ కాదు:  ఎంపీ తలారి రంగయ్య
అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం చెప్తున్నట్లుగా ప్రత్యేక హోదా అనేది క్లోజ్‌డ్‌ చాఫ్టర్‌ కాదు. ఎట్టిపరిస్థితుల్లోనూ అది క్లోజ్‌డ్‌ చాప్టర్‌ కాదు.. వాళ్లు ఎన్నిసార్లు హోదా ఇవ్వలేము చెప్పినా మేం అన్నిసార్లు ఇవ్వమని అడుగుతూనే ఉంటాం.

విభజన చట్టంలో ప్రతిపాదించి ఇప్పటి వరకూ అమలు కాని అంశాలపై కూడా ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెడతాం. అయితే ఇవాళ దానిపై చర్చ ఉన్నా సభ వాయిదా పడటంతో కుదరలేదు. అవకాశం రాగానే మిగతా పార్టీల మద్దుతు కూడగట్టుకుని ఓటింగ్‌ కి వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు.

రాష్ట్రానికి అన్యాయం చేసినట్లే..: సుభాష్‌ చంద్రబోస్‌
రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్ మాట్లాడుతూ, ఏపీ విభజన సందర్భంగా.. అప్పట్లో కేంద్రం ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చని పరిస్థితి ఉంది. బడ్జెట్‌లో మా లాంటి చిన్న రాష్ట్రాలకు చేయూత ఇస్తారని ఆశించాం. ప్రత్యేక హోదా కోరిక నెరవేర్చకపోవడం, విశాఖ రైల్వే జోన్‌ ఇవ్వకపోవడం వంటివి బాధపెట్టాయి. దేశంలో ఉన్న అన్ని ఎయిమ్స్‌లకు కలిపి రూ.6700 కోట్లు ఇచ్చారు.

అమరావతిలోని ఎయిమ్స్‌ కొత్తగా పెట్టిన ఆస్పత్రి.. వచ్చే ఆ నిధులు ఎందుకూ సరిపోవు.. మరిన్ని నిధులు ఇస్తేగానీ అక్కడ అభివృద్ధి జరగదు. అరకొర నిధులతో ఇంకా కొనసాగిస్తున్నారంటే తీవ్రమైన అన్యాయాన్ని రాష్ట్రానికి చేసినట్లే పవిత్ర దేవాలయం లాంటి పార్లమెంటులో ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమైతే ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగే ప్రమాదం ఉందని ప్రధాని గమనించాలి. ఒక ప్రభుత్వం పార్లమెంటులో ఒక హామీ ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉంటుందని ఎంపీ అన్నారు.

ప్రత్యేక హోదా రానివ్వకుండా చేసిన ఘనుడు చంద్రబాబు: రెడ్డప్ప
ఎంపీ ఎన్‌. రెడ్డప్ప మాట్లాడుతూ, బడ్జెట్‌లో ఏపీకి మొండి చేయి చూపినందున ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టింది కానీ దేశవ్యాప్తంగా తనకు మనుగడ లేకుండా చేసుకుంది. అనేక సంక్షేమ పథకాలతో జగన్‌ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రత్యేక హోదాపై గత నాలుగేళ్లుగా మేం పార్లమెంటులో విన్నపాలు చేస్తూనే ఉన్నాం. మా ముఖ్యమంత్రి సుమారు 20 సార్లు ఢిల్లీ వచ్చి హోదా ఇవ్వమని కేంద్రాన్ని కోరారు. ఇంతకాలం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పోరాటాలు చేస్తూనే ఉన్నాం...స్పందన లేదు కాబట్టే ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు పెడుతున్నాం.

కచ్చితంగా పార్లమెంటులో మా గళాన్ని వినిపించి హోదాను సాధించుకుంటాం. రాష్ట్రాన్ని విడగొట్టింది చంద్రబాబే... ప్రత్యేక హోదా, నిధులు రానివ్వకుండా చేసిన ఘనుడు చంద్రబాబు-మళ్లీ ఆయనే మమ్మల్ని తప్పు పడుతున్నారు. ఎంతో అనుభవం ఉందన్న చంద్రబాబు కనీసం కుప్పానికి మంచినీళ్లు కూడా తీసుకురాలేకపోయాడు. కుప్పంలో లోకేశ్‌కు కనీసం వెయ్యి మంది కూడా రావడం లేదు..పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లయ్యింది లోకేష్ పాదయాత్ర. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా సీఎం జగన్‌ ప్రభంజనం ఉంటుందని రెడ్డప్ప అన్నారు.

చదవండి: థ్యాంక్యూ సీఎం జగన్‌ సార్‌.. మా కల నెరవేరుస్తున్నారు’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top