తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 15వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రమైన భీమవరంలో వైఎస్ జగన్ పర్యటిస్తారు. ప్రస్తుతం ఆక్వా రంగం సంక్షోభంలో పడిన నేపథ్యంలో రైతులు, రైతు నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు.
ఈ విషయాన్ని పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు వెల్లడించారు. ఈరోజు(ఆదివారం, జూలై 5వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ప్రసాదరాజు.. ఈనెల 15న వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు రానున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఆక్వా రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా తెలిపిన ప్రసాదరాజు.. ఇందుకు కారణం చంద్రబాబు పాలనేనన్నారు. ‘కూటమి పాలనలో ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లింది. ప్రభుత్వం ఆక్వా రైతులను వదిలేసి ఫీడ్ వ్యాపారులకు మద్దతు పలుకుతోంది. కరెంటు సబ్సిడీ తొలగించి రైతులపై భారం వేసింది. రెండు సార్లు ఫీడ్ ధర పెంచి రైతుల నడ్డి విరిచారు. ఎగుమతుల సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఎన్నికల హామీ ప్రకారం ఫీడ్ ధర తగ్గించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం.
అనేకసార్లు పెద్ద ఎత్తున ఆందోనలు చేపట్టాం. అయినాసరే సిండికేట్ అయిన వ్యాపారులకే మద్దతు తెలుపుతోంది. అందుకే ఆక్వా రైతులంతా వైఎస్ జగన్ని కలిసి విన్నవించాం. ఒకటీ తేదీ వరకు ప్రభుత్వానికి సమయం ఇచ్చాం. చంద్రబాబు హడావుడిగా అప్సడా మీటింగ్ పెట్టారు. ఫీడ్ ధర రూ.4 లు తగ్గించమంటే వ్యాపారులు రూ.2 లే తగ్గించారు. అసలు రూ. 14 లు పెంచి, రూ.2 లు తగ్గించటం ఏంటి?, అందుకే ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. చంద్రబాబు కావాలనే ఆక్వా రైతుల నడ్డి విరిచారు’అని ధ్వజమెత్తారు.


