సాగు చట్టాల రద్దుకు మద్దతుగా.. వైఎస్సార్‌సీపీ కొవ్వొత్తుల ర్యాలీలు | YSRCP candle rallies for Abolition of cultivation laws by central | Sakshi
Sakshi News home page

సాగు చట్టాల రద్దుకు మద్దతుగా.. వైఎస్సార్‌సీపీ కొవ్వొత్తుల ర్యాలీలు

Nov 21 2021 3:44 AM | Updated on Nov 21 2021 3:44 AM

YSRCP candle rallies for Abolition of cultivation laws by central - Sakshi

గుంటూరు జిల్లా బాపట్లలో కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్న డిప్యూటీ స్పీకర్‌ కోన, పార్టీ నాయకులు

సాక్షి నెట్‌వర్క్‌: కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను ఉపసంహరించడాన్ని స్వాగతిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించింది. వివిధ జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల నేతృత్వంలో ఈ ర్యాలీలు జరిగాయి. విశాఖపట్నంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన జగదాంబ జంక్షన్‌ వరకు జైకిసాన్‌ నినాదంతో సాగింది. నెడ్‌ క్యాప్‌ చైర్మన్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం జాతీయ రహదారి నుంచి మహారాణి పార్లర్‌ కూడలి వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అలాగే, అచ్యుతాపురం జంక్షన్‌లో డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఉప్పలపాటి సుకుమారవర్మ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.

ఇంకా చోడవరం, బుచ్చెయ్యపేట, పాడేరు, అరకు తదితర ప్రాంతాల్లోనూ ఈ ర్యాలీలు నిర్వహించారు. ప్రతిచోటా వ్యవసాయ చట్టాల రద్దు రైతుల విజయం అని నినాదాలు చేశారు. సాగు చట్టాలను కేంద్రం రద్దుచేయడంపై శ్రీకాకుళం జిల్లాలోని వైఎస్సార్‌సీపీ శ్రేణులూ జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాయి. రైతుల పోరాటాలకు వైఎస్సార్‌సీపీ మద్దతిచ్చిన విషయాన్ని గుర్తుచేశాయి. అలాగే, రైతన్నలకు సంఘీభావంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కోట నుంచి గంట స్తంభం కూడలి వరకు సాగిన ర్యాలీలో మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి పాల్గొన్నారు.

తూర్పు గోదావరిలో..
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాయి. రామచంద్రపురంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కాకినాడ రూరల్‌లో ఎంపీ వంగ గీత, పి.గన్నవరంలో జెడ్పీ చైర్మన్‌ వేణుగోపాల్, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు. ఇక రైతులకు సంఘీభావంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జెడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్, ద్వారకా తిరుమల, నిడదవోలులో ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, జి. శ్రీనివాసనాయుడు పాల్గొని విజయం సాధించిన రైతులకు అభినందనలు తెలిపారు. వీరికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా నిలిచి సీఎం జగన్‌ రైతుల పక్షపాతిగా నిలిచారని కొనియాడారు.  

కృష్ణా జిల్లాలో..
కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు, నందిగామలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌రావు, జగ్గయ్యపేటలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నేతృత్వంలో ర్యాలీలు నిర్వహించారు. కైకలూరులో కూడా జరిగింది. గుంటూరుతో పాటు బాపట్ల, చిలకలూరిపేట, మంగళగిరి, పెదకూరపాడు, చెరుకుపల్లి, వినుకొండ, దాచేపల్లి, తెనాలి, తాడికొండలలో ఈ ర్యాలీలు నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాళి గిరి, ముస్తఫా, బొల్లా బ్రహ్మనాయుడు, డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు.

ఇక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, రైతుల ఆధ్వర్యంలో క్యాండిల్‌ ర్యాలీ చేపట్టారు. వెంకటాచలం, సూళ్లూరుపేట, గూడూరు, ఉదయగిరి బస్టాండ్‌ సెంటర్, వింజమూరు, కావలి పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. కర్నూలు జిల్లావ్యాప్తంగా కూడా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పార్టీ కర్నూలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, మేయర్‌ బీవై రామయ్య, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, డాక్టర్‌ సుధాకర్‌తో పాటు  పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement