నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్‌ భేటీ | YS Jagan to Meet with Local Government Representatives on April 2 | Sakshi
Sakshi News home page

నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్‌ భేటీ

Apr 2 2025 5:15 AM | Updated on Apr 2 2025 7:50 AM

YS Jagan to Meet with Local Government Representatives on April 2

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం

ధీర నేతలను అభినందించనున్న పార్టీ అధినేత

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున గట్టిగా నిలబ­డిన ప్రజా ప్రతినిధులను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించనున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, కిడ్నా­ప్‌లు చేసినా, కేసులు పెట్టి వేధించినా.. అన్ని ఇబ్బం­దులను గట్టిగా ఎదుర్కొని పార్టీ కోసం నిలబడి పోరాడిన వారి అంకిత భావాన్ని గుర్తిస్తూ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.

బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో 8 నియోజకవర్గాల్లోని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీ­టీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు, కో–ఆప్టెడ్‌ సభ్యులు హాజరవుతారు. ఇటీవలి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్న అప్రజా­స్వామిక పరిణామాలపై చర్చించడంతోపాటు, భవిష్యత్‌ కార్యాచరణపైనా ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం అన్ని కష్టాలు ఎదుర్కొని నిలబడిన నాయకులు, ప్రజా ప్రతిని«ధులకు మరింత స్ఫూర్తినిచ్చేలా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. 

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
వచ్చే వారం స్వయంగా నేనే వస్తా
టీడీపీ ఎమ్మెల్యే బంధువుల చేతిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య 
కుటుంబానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా 
బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పిన వైఎస్సార్‌సీపీ అధినేత  

సాక్షి, అమరావతి/రామగిరి: ‘ఏమాత్రం అధైర్యప­డొద్దు.. మీ కుటుంబానికి పూర్తిగా అండగా నిలు­స్తాం.. అన్ని విధాలా ఆదుకుంటాం.. వచ్చే వారం స్వయంగా నేనే వస్తా’ అని వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియో­జకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డి­పల్లిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధు­వుల చేతిలో దారుణ హత్యకు గురైన కురుబ లింగ­మయ్య కుటుంబాన్ని మంగళవారం ఆయన ఫోన్‌లో పరామర్శించారు.

లింగమయ్య భార్య రామాం­జినమ్మ, కుమా­రులు మనోహర్, శ్రీని­వాసులతో మాట్లాడారు. లింగమయ్య హత్యకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. ‘సార్‌.. రామగిరి మండలంలో రాక్షసపాలన కొనసాగుతోంది. పరిటాల సునీత నుంచి మాకు ప్రాణహాని ఉంది. ఇక్కడి పోలీసులు పరిటాల కుటుంబ సభ్యు­లకు తొత్తులుగా మారారు. వైఎస్సార్‌సీపీ నాయ­కులు, కార్యకర్తలను టార్గెట్‌ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం రామగిరి ఎంపీపీ ఎన్నిక జరుగుతున్న సమయంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు జయచంద్రారెడ్డి ఇంటిపై పరిటాల సునీత సమీప బంధువులైన ధర్మవరపు ఆదర్శ్‌నాయుడు, ధర్మవ­రపు మనోజ్‌ నాయుడు దాడులకు దిగారు. వారిని మా నాన్న అడ్డుకో­బో­యాడు.

 దీంతో కక్ష కట్టి వైఎస్సార్‌సీపీకి అనుకూ­లంగా ఉన్నారంటూ పండుగ వేళ ఇంట్లో ఉన్న మాపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటనలో నాన్న లింగమయ్య మృతి చెందాడు’ అంటూ కుమారులు మనోహర్, శ్రీనివాసులు... మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. మీరు అధైర్య పడొద్దని, పార్టీ తప్పకుండా అండగా ఉంటుందని, ఆదుకుంటుందని లింగమయ్య కుటుంబానికి వైఎస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు. వైఎస్సార్‌సీపీ జిల్లా నేతలు, లీగల్‌సెల్‌ను అప్రమత్తం చేస్తామని, వారు తగిన రక్షణ కల్పిస్తారన్నారు. ‘మీ కుటుంబానికి ఏం జరిగినా చూస్తూ ఊరుకోం. పూర్తి అండగా నిలుస్తాం. అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఏ మాత్రం భయపడొద్దు. ధైర్యంగా ఉండండి’ అంటూ వైఎస్‌ జగన్‌ వారికి భరోసా ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement