కోవిడ్‌ మరణాలు ఇంకా ఎక్కువేనట! 

World Countries showing the lowest number of Covid deaths - Sakshi

తక్కువగా చూపిస్తున్న ప్రపంచ దేశాలు.. 

మరణాల్ని తగ్గించి చూపుతున్న దేశాల జాబితాలో రష్యాదే అగ్రస్థానం 

రెండు, మూడు స్థానాల్లో భారత్, మెక్సికో 

యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ నివేదిక వెల్లడి 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ మరణాలను ప్రపంచ దేశాలు తక్కువగా చూపిస్తున్నాయంటోంది యూనివర్సిటీ ఆఫ్‌ అమెరికాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్‌–ఇవాల్యూయేషన్‌ (ఐహెచ్‌ఎంఈ). 21 దేశాలు కోవిడ్‌ మరణాలను తక్కువగా చూపిస్తున్నాయని ఆ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. వాటిలో ప్రధానంగా ఆరు దేశాలు మే 3 నాటికి వెల్లడించిన కోవిడ్‌ మరణాలను వివరిస్తూ.. ఆ దేశాల్లో వాస్తవంగా ఎంతమంది కోవిడ్‌తో మరణించి ఉంటారనే అంచనాతో ఓ అధ్యయనాన్ని విడుదల చేసింది. ఆరు దేశాల జాబితాలో భారత్‌తోపాటు రష్యా, అమెరికా, మెక్సికో, బ్రెజిల్, బ్రిటన్‌ ఉన్నాయి.  

నివేదికలోని అంశాలు సంక్షిప్తంగా.. 
► కరోనా మరణాలను అత్యధిక శాతం తగ్గించి చూపుతున్న దేశాల జాబితాలో రష్యా మొదటి స్థానంలో ఉంది. అధికారికంగా వెల్లడిస్తున్న మరణాల సంఖ్య కంటే ఆ దేశంలో ఐదున్నర రెట్లు ఎక్కువమంది చనిపోయి ఉంటారని నివేదిక పేర్కొంది. మే 3 నాటికి రష్యాలో 1,09,334 మంది కోవిడ్‌తో చనిపోయినట్టు ఆ దేశం వెల్లడించింది. కాగా ఆ దేశంలో 5,93,610 మంది కోవిడ్‌తో మరణించి ఉంటారని నివేదిక అంచనా వేసింది.  
► ఆ జాబితాలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. అధికారికంగా వెల్లడిస్తున్న మరణాల సంఖ్య కంటే భారత్‌లో మూడు రెట్లు ఎక్కువ మంది చనిపోయి ఉంటారని నివేదిక అంచనా వేసింది. మే 3నాటికి భారత్‌లో 2,21,181 మంది కోవిడ్‌తో చనిపోయినట్టు అధికారికంగా వెల్లడించారు. కానీ 6,54,395 మంది కోవిడ్‌తో మరణించి ఉంటారని నివేదిక అంచనా వేసింది.  
► కరోనా మరణాలను తగ్గించి చూపుతున్న జాబితాలో మెక్సికో మూడో స్థానంలో ఉంది. మే 3 నాటికి మెక్సికోలో 2,17,694 మంది కోవిడ్‌తో చనిపోయినట్టు ఆ దేశం వెల్లడించింది. కానీ.. 6,17,127 మంది మరణించి ఉంటారని అంచనా వేసింది.  
► కరోనా మరణాలను తగ్గించి చూపుతున్న దేశాల జాబితాలో అమెరికా 4వ స్థానంలో ఉంది. మే 3నాటికి అమెరికాలో కోవిడ్‌తో 5,74,043 మంది మరణించినట్టు అధికారికంగా వెల్లడించారు. కానీ ఆ దేశంలో 9,05,289 మంది కోవిడ్‌తో చనిపోయి ఉంటారని ఆ నివేదిక పేర్కొంది. 
► ఈ జాబితాలో బ్రెజిల్‌ ఐదో స్థానంలో ఉంది. మే 3 నాటికి బ్రెజిల్‌లో 4,08,680 మంది కోవిడ్‌తో చనిపోయినట్టు చూపుతుండగా.. 5,95,903 మంది మరణించి ఉంటారని నివేదిక అంచనా వేసింది. 
► బ్రిటన్‌లో అధికారిక లెక్కల ప్రకారం మే 3నాటికి 1,50,519 మంది కోవిడ్‌తో మరణించారని అధికారికంగా చెబుతుండగా.. 2,09,661 మంది మృతి చెంది ఉంటారని నివేదిక 
అంచనా వేసింది.  
► చాలా దేశాల్లో కోవిడ్‌ పరీక్షలు తక్కువగా చేస్తున్నారు. అందువల్ల చాలా మరణాలు కోవిడ్‌ జాబితాలో చేరడం లేదు. 
► మానసిక ఆందోళన, కుంగుబాటు కేసులు అమాంతంగా పెరుగుతున్నాయి. వాటితో సంభవిస్తున్న మరణాలు కోవిడ్‌ జాబితాలోకి రావడం లేదు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top