నంద్యాల: ఏపీలోని నంద్యాల జిల్లాలోని మహానంది క్షేత్రం సమీపంలో భారీ కార్చిచ్చు చెలరేగింది. పవిత్ర క్షేత్రానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవిలో మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో అడవి సంపదతో పాటు వన్యప్రాణుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడింది.
స్థానికుల సమాచారం ప్రకారం.. అడవిలోకి ఎండుకర్రల కోసం వెళ్లిన కొంతమంది వ్యక్తులు నిర్లక్ష్యంగా ప్రవర్తించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాగిన బీడీలను ఆర్పకుండా అడవిలో పడేయడం వల్లే ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఎండ గాలులు తీవ్రంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో అడవిలో నివసించే జంతువులు తీవ్ర ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది.


