కడప అర్బన్ : కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్లో తన భర్త మద్దూరి దినేష్ నివసిస్తున్న ఇంటి ఎదుట భార్య శ్రీలక్ష్మి బుధవారం న్యాయం కోసం ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా బాధిత మహిళ శ్రీలక్ష్మి మీడియాతో మాట్లాడారు. తనకు, మద్దూరి దినేష్ కు 2022 జూన్ 18న కర్నూల్లో వివాహమైందని, తమకు కుమారుడు ఉన్నాడని తెలిపారు.
తన భర్త, కుటుంబ సభ్యులు వివాహ సమయంలో ఇచ్చిన 25 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, 5 లక్షల రూపాయలు నగదు, తాను ఉద్యోగం చేసి సంపాదించిన రూ.లక్ష ఇరవై వేలు, తనకు సంబంధించిన విద్యార్హత సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు సంబంధించిన వస్తువులను తీసుకునేందుకు వస్తే వారు పలకడం లేదన్నారు. న్యాయం కోసం ఇంటిముందు బైఠాయించాల్సి వచ్చిందని తెలిపారు. తాను మూడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు కర్నూలులోని తమ పుట్టింటిలో వదిలేసి వెళ్లిపోయాడని, తర్వాత కుమారుడుజన్మించాడు, అప్పటినుంచి పట్టించుకోలేదని తెలిపారు. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని బాధిత మహిళ ఆరోపించారు.
వివాహమైనప్పటినుంచి తనను శారీరకంగా మానసికంగా బాధపెట్టారని తెలియజేశారు. ఆమె తల్లి, రెండున్నర సంవత్సరాల కుమారుడు, టీడీపీకి చెందిన నాయకురాలు, బంధువులు వచ్చి అండగా నిలబడ్డారు. ఈ సంఘటనపై చిన్న చౌక్ పోలీసులు మాట్లాడుతూ ఇప్పటికే అనంతపురం జిల్లా తాడిపత్రిలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని, కోర్టులో కేసు నడుస్తుందని తెలియజేశారు. ఆందోళన విషయమై మహిళను పిలిపించి మాట్లాడామని తెలిపారు.


