సాక్షి, ఏలూరు: జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి కోసం సుపారీ ఇచ్చిన భార్య.. భర్తను హత్య చేయించింది. గత నెల 17న హత్యకు గురైన ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామానికి చెందిన రెడ్డి సులేమాన్ రాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో భార్యే అసలు సూత్రధారిగా పోలీసులు గుర్తించారు.
వడ్లమాను సచివాలయంలో పనిచేస్తున్న వెంకన్నబాబుతో సులేమాన్ రాజు భార్య దుర్గామణి అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలియడంతో దుర్గారాణిని సులేమాన్ రాజు తరచూ వేధించేవాడు. భర్త పెట్టే బాధలు పడలేక చనిపోవాలనుందంటూ దుర్గామణి ప్రియుడికి చెప్పింది. సులేమాన్ రాజు అడ్డు తప్పించాలని దుర్గామణి ప్లాన్ వేసింది.
తన బంధువుల సాయంతో సులేమాన్ రాజు హత్యకు వెంకన్నబాబు సుపారీ ఇచ్చారు. రూ.12 లక్షలు ఇచ్చిన దుర్గామణి, వెంకన్నబాబు.. సులేమాన్ రాజు అడ్డు తొలగించుకున్నారు. సెల్ఫోన్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కేబుల్తో సులేమాన్ రాజును నిందితులు హత్య చేశారు. హత్య అనంతరం ఉప్పులూరు రైవస్ కాలువలో సులేమాన్ రాజు మృతదేహాన్ని పడేశారు. సులేమాన్ రాజు భార్య దుర్గామణి, వెంకన్నబాబు, మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సెల్ ఫోన్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కేబుల్, కారు, ఐదు సెల్ ఫోన్లు, ఐదు ఖాళీ బీరు సీసాలు, రూ. 75 వేలు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


