ఎనిమిది మందితో ప్రేమ పెళ్లి.. వ్యభిచారం చేయాలంటూ! | Sakshi
Sakshi News home page

విశాఖలో నిత్య పెళ్లికొడుకు బాగోతం; డీజీపీ సీరియస్

Published Wed, Mar 31 2021 1:45 PM

Viral: Visakhapatnam Man Has Been Booked For Marrying 8 Women - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖలో ఓ నిత్య పెళ్లికొడుకు అరాచకాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మందిని అరుణ్‌ కుమార్‌ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు వారితో సఖ్యతగా మెలిగి ఆ తరువాత వ్యభిచారం చేయాలని భార్యలపై ఒత్తిడి పెంచాడు. గంజాయి వ్యభిచార ముఠాలో సంబంధాలున్న అరుణ్‌.. భార్యలతో కాకుండా తన మొదటి భార్య కుమార్తెను వ్యభిచార ముఠాకు అమ్ముతానంటూ వేధింపులకు గురిచేశాడు. మాట వినకపోతే చంపుతానంటూ తుపాకీ, కత్తులతో బెదిరింపులకు పాల్పడ్డాడు.

మొదటి భార్య గీతాంజలి, రెండో భార్య లక్ష్మీని వ్యభిచారం వృత్తిలో దింపి చిత్రహింసలు పెట్టాడు. అయితే అరుణ్ కుమార్ మొదటి భార్య ఎదురు తిరగడంతో ఈ నిత్య పెళ్లి కొడుకు లీలలు ఒక్కొక్కటిగా వెలుగులో చూస్తున్నాయి. కీచక భర్త ఆగడాలపై గత నెలలో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక అరుణ్ కుమార్‌కు సంబంధాలున్నాయని, అందుకే అరుణ్ కుమార్‌పై చర్యలు తీసుకోవటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మహిళ సంఘాలను ఆశ్రయించడంతో వారు ఈ విషయాన్ని సీపీ మనీష్‌ కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. తమకు ప్రాణహాని ఉందని, తక్షణమే అరుణ్ కుమార్‌ను అరెస్ట్ చేయాలని సీపీ మనీష్ కుమార్‌కు బాధితులు వాయిస్ మెసేజ్ పెట్టారు. దీనిపై స్పందించిన సీపీ నిందితుడిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

పోలీసులపై డీజీపీ సీరియస్‌
కాగా నిత్యపెళ్లికొడుకు అరుణ్‌పై కేసు నమోదులో నిర్లక్ష్యంపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని ఆదేశించారు. కేసు నమోదులో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపైనా దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు.

చదవండి: పెద్దల్ని ఎదిరించి ప్రేమ పెళ్లి, నాలుగు నెలలకే..

Advertisement
Advertisement