గుంటూరు: రాజధాని అంశానికి సంబంధించి ఉండవల్లి రైతులు కీలక తీర్మానం చేశారు. రాజధానికి భూములిచ్చే ప్రసక్తే లేదని తీర్మానంలో పేర్కొన్నారు. ఉండవల్లిని రాజధాని గ్రామాల నుంచి మినహాయించాలని తీర్మానం చేశారు.
రైతులు ఇష్టపూర్వకంగా భూములు ఇస్తేనే ప్రభుత్వం తీసుకుంటుందని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారని కానీ దానికి విరుద్ధంగా రైతులు దగ్గర నుంచి బలవంతంగా భూములు ప్రభుత్వం సేకరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తమ భూములిచ్చే ప్రసక్తే లేదన్నారు. ఈ మేరకు ఆదివారం(మే 24వ తేదీ) ఉండవల్లి రైతులు సమావేశమయ్యారు.
రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడానికి ప్రభుత్వం భూసేకరణ, భూసమీకరణ అమలు చేస్తే న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు ప్రభుత్వం ఉండవల్లికి ఏమి అభివృద్ధి చేసిందని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు రాజధానిలో లంక భూములు కొట్టేసి లాభపడితే... మేము మా సొంత భూములు త్యాగం చేయాలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అన్ని పార్టీలు కలిసి భారీ స్థాయిలో ఉద్యమం చేయాలని ఉండవల్లి రైతులు తీర్మానం చేశారు.


