వడ్డీకాసుల వాడికి కాసులే కాసులు | TTD Tirumala Srivari hundi income increased | Sakshi
Sakshi News home page

వడ్డీకాసుల వాడికి కాసులే కాసులు

Jun 28 2022 2:22 AM | Updated on Jun 28 2022 2:22 AM

TTD Tirumala Srivari hundi income increased - Sakshi

తిరుమల: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు నెలలుగా ప్రతినెలా రూ.100 కోట్లకు పైగా వస్తోంది. ముందెన్నడూ లేనివిధంగా మే నెలలో అత్యధికంగా రూ.129.93 కోట్ల ఆదాయం సమకూరింది. కోవిడ్‌ కారణంగా గడచిన రెండేళ్లలో శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించడంతో ఆ కాలంలో హుండీ ఆదాయం బాగా తగ్గింది.

ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో శ్రీవారి దర్శనానికి భక్తులను పూర్తి స్థాయిలో టీటీడీ అనుమతిస్తోంది. కాగా, ప్రస్తుతం శ్రీవారి హుండీ ఆదాయం గతం కంటే ఎక్కువగా లభిస్తోంది. గతంలో ఏడాదికి రూ.1,200 కోట్ల వరకూ హుండీ ఆదాయం లభించేది. మే, జూన్‌ నెలల్లో రూ.100 కోట్ల మార్కును దాటేది. మిగిలిన నెలల్లో మాత్రం నెలనెలా వచ్చే హుండీ ఆదాయం రూ.100 కోట్ల లోపే వుండేది. ప్రస్తుతం రోజుకు సుమారు రూ.4 కోట్లు హుండీ ద్వారా వస్తోంది. 

వార్షికాదాయం రూ.1,500 కోట్లు దాటొచ్చు
ఈ ఏడాది మార్చి నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.128 కోట్లు రాగా, ఏప్రిల్‌ నెలలో రూ.127.5 కోట్లు లభించింది. మే నెలలో టీటీడీ చరిత్రలోనే అత్యధికంగా రూ.129.93 కోట్ల ఆదాయం వచ్చింది. జూన్‌ నెల పూర్తి కాకుండానే రూ.100 కోట్ల మార్కును దాటింది. జూన్‌ 1వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రూ.106 కోట్ల వరకు వచ్చింది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు రూ.500 కోట్ల ఆదాయం లభించడంతో.. ఈ ఏడాది వార్షిక హుండీ ఆదాయం రూ.1,500 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement