ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించలేదు | TTD Special Dharshanam were not restarted | Sakshi
Sakshi News home page

ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించలేదు

Oct 20 2021 4:41 AM | Updated on Oct 20 2021 4:41 AM

TTD Special Dharshanam were not restarted - Sakshi

తిరుమల: కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో 2020, మార్చి 20వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేసినట్టు టీటీడీ పీఆర్‌వో విభాగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్‌ పూర్తిగా అదుపులోకి రానందువల్ల వీరి దర్శనాల విషయంలో ఇదే స్థితి కొనసాగుతోంది. అయితే, కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించినట్టు అవాస్తవ సమాచారం జరుగుతోంది. అనేకమంది ఇది నిజమని నమ్మి తిరుపతికి వచ్చి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. భక్తులు ఈ విషయం గుర్తించాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. 

రేపటి నుంచి అయోధ్య కాండ
లోక సంక్షేమం కోసం, కరోనా వ్యాప్తిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలో ఈనెల 21 నుంచి నవంబర్‌ 16వ తేదీ వరకు అయోధ్య కాండ పారాయణ దీక్ష జరగనుంది. తిరుమల వసంత మండపంలో శ్లోక పారాయణం, ధర్మగిరి శ్రీ వేంకటేశ్వర వేద వి/ê్ఞన పీఠంలో జప, తర్పణ, హోమాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం బుధవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు అంకురార్పణ జరగనుంది. 

పారదర్శకంగా లడ్డూ కౌంటర్ల నిర్వహణ
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఉన్న లడ్డూ కౌంటర్ల నిర్వహణ పారదర్శకంగా జరుగుతోంది. రద్దీకి తగ్గట్టుగా కౌంటర్లు ఏర్పాటు చేయడంతో భక్తులు సంతృప్తిగా లడ్డూ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. లడ్డూ కాంప్లెక్స్‌లో మొత్తం 62 కౌంటర్లు ఉన్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం 31 లడ్డూ కౌంటర్లను నడుపుతున్నారు. వీటిలో 26 కౌంటర్లకు 6 బ్యాంకులు స్పాన్సర్‌షిప్‌ అందించాయి. 

నేడు పౌర్ణమి గరుడ సేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్‌ 20న బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ నిర్వహించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ దర్శనమిస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement