
డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో మాట్లాడుతున్న జవహర్రెడ్డి
తిరుమల: దేశీయ గోవుల నుంచి సేకరించిన పాల నుంచి పెరుగు తయారు చేసి, దాన్ని చిలికగా వచ్చిన వెన్నను వేంకటేశ్వరస్వామి వారికి సమర్పించేందుకు ఉద్దేశించిన నవనీత సేవలో భక్తులు పాల్గొనేందుకు అవకాశం కల్పించనున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి చెప్పారు. ఈ నెల 13వ తేదీ నుంచి 7 బ్రాండ్లతో పరిమళభరిత అగరబత్తీలు భక్తులకు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో శనివారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో జవహర్రెడ్డి మాట్లాడారు. తిరుమలలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడి హోలీ గ్రీన్ హిల్స్గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెప్పారు.
ఇందుకోసం దశలవారీగా డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలను వినియోగించనున్నట్లు చెప్పారు. తొలి దశలో 35 విద్యుత్ కార్లను (టాటానెక్సాన్) తిరుమలలోని సీనియర్ అధికారులకు అందించినట్లు తెలిపారు. రెండో దశలో యాత్రికులకు ఉచిత బస్సులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు ఏకాంతంగా జరగనున్నాయని వీటిని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని చెప్పారు. వర్చువల్ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా సంబంధిత టికెట్లను ఆ¯న్లై¯న్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.