డోలీలో 4 కొండలు దాటి.. 7 కి.మీ కాలినడక.. పాముకాటు బాధితురాలి నరకయాతన
కూటూరు పీహెచ్సీకి తరలింపు.. అందుబాటులో లేని వైద్యుడు
కష్టాల ‘డోలి’కల్లో గిరిజనం
చంద్రబాబు దుష్టపాలన ప్రజలకు నరకప్రాయంగా మారింది. ఓవైపు వసతుల్లేక గిరిజన ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పీహెచ్సీల్లో వైద్యుల్లేక.. ప్రాణాపాయ స్థితిలో బతుకులీడుస్తున్నారు. పోలవరం జిల్లా కూనవరం మండలం కార్మానుకొండలో పాముకాటు బాధితురాలిని ఆస్పత్రికి తరలించేందుకు నాలుగు కొండలు దాటి.. ఏడు కిలోమీటర్లు కాలినడకన డోలీలోనే మోసుకెళ్లారు. పీహెచ్సీల్లో వైద్యులు లేకపోవడంతో తెలంగాణలోని భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కూనవరం: పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండల పరిధిలోని కార్మానుకొండలో ఆదివారం అర్ధరాత్రి సూట్రు సమ్మక్క ప్రియ(16) పాము కాటుకు గురైంది. ఆ సమయంలో చెవి పక్కన ఏదో కుట్టిందని ఆమె తన తండ్రి లక్ష్మారెడ్డికి చెప్పింది. కొద్దిసేపటికి బిడ్డ పరిస్థితిలో మార్పు కనిపించడంతో పాము కాటు అని తండ్రి నిర్ధారణకు వచ్చాడు. వెంటనే రహదారి లేని ఆ గ్రామం నుంచి కుటుంబసభ్యుల సహకారంతో కూటూరు పీహెచ్సీకి డోలీ కట్టుకొని బయలుదేరారు.
కార్మానుకొండ నుంచి 4 కొండలు ఎక్కి..మళ్లీ కిందికి దిగి..ఆపై 7 కిలోమీటర్లు కాలిబాటన వచ్చి..అతికష్టంమీద ఆర్అండ్బీ రోడ్డుకు చేరుకున్నారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఈఎన్టీ వెంకట్ తన మోటారు బైక్పై బాధితురాలిని కూటూరు పీహెచ్సీకి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యుడు లేకపోవడంతో స్టాఫ్ నర్స్ ప్రథమ చికిత్స చేసి.. చింతూరు ఏరియా ఆస్పత్రికి పంపించింది. అక్కడ పరీక్షించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం బాధితురాలు ఐసీయూలో ఉందని, 24 గంటలు గడిస్తేగానీ ఆమె ఆరోగ్యంపై స్పష్టత రాదని వైద్యులు చెప్పినట్టు బాధితురాలి తండ్రి తెలిపాడు.


