
కేదార్నాథ్ యాత్రకని ప్రయాణికుల నుంచి రూ.లక్షలు వసూలు
హరిద్వార్లో వదిలేసిపత్తాలేని ట్రావెల్స్ యజమాని
నానా అగచాట్లు పడుతూ తిరిగొచ్చిన యాత్రికులు
ట్రావెల్స్పై ఫిర్యాదుకు తెనాలి వచ్చిన బాధితులు
తెనాలి: పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్ యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది యాత్రికుల నుంచి డబ్బు వసూలు చేసిన నిర్వాహకుడు వారిని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో వారంతా నానాఅగచాట్లు పడ్డారు. ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకుని నానా బాధలు పడుతూ సొంత ఊళ్లు చేరుకున్నారు. తమను అవస్థలు పెట్టిన ట్రావెల్స్ నిర్వాహకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మంగళవారం గుంటూరు జిల్లా తెనాలి చేరుకున్నారు. మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు.
తెనాలిలోని శ్రీ అరుణాచలేశ్వర, మణికంఠ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకుడు ఎం.గురుమూర్తి మొత్తం 260 మందిని సరస్వతీ నది పుష్కరాల యాత్ర, కేదార్నాథ్ దర్శనానికి తీసుకెళ్లేందుకు వసూలు చేశారు. ఒక్కొక్కరి వద్ద రూ.22 వేల నుంచి రూ.34 వేల వరకు రూజ85 లక్షల వరకు తీసుకున్నారు. పర్వతం మీదుండే కేదార్నా«థ్ ఆలయానికి హెలికాప్టర్లో వెళ్లేందుకు ఆసక్తి చూపిన వారి నుంచి అదనంగా రూ.15 వేలు వసూలు చేశారు. ప్రయాణికులు భోజనం, వసతి సహా అన్నింటికీ డబ్బులు ముందుగానే చెల్లించారు.
యాత్రికులంతా రాష్ట్రంలోని గుంటూరు, చీరాల, ఒంగోలు, విజయవాడ, భీమవరం, రాజమహేంద్రవరం ప్రాంతాలకు చెందిన వారే. విజయవాడ నుంచి ఢిల్లీ వరకు రైలు ప్రయాణం, అక్కణ్నుంచి హరిద్వార్కు బస్సు అని చెప్పారు. మొత్తం 15 రోజుల యాత్ర. ప్రణాళిక ప్రకారం యాత్రికులు మే 17వ తేదీన రైలులో ఢిల్లీ చేరుకున్నారు. అక్కణ్నుంచి ఏర్పాటు చేసిన బస్సుల్లో 18వ తేదీకి హరిద్వార్ చేరుకున్నారు. 19వ తేదీ ఉదయం ప్రయాణానికి సిద్ధంగా ఉండమని చెప్పి వెళ్లిన నిర్వాహకుడు గురుమూర్తి ఆ తర్వాత కనిపించలేదు. ఫోన్ స్విచాఫ్లో ఉంది. దీంతో చేతిలో డబ్బుల్లేనివారు నానా అవస్థలు పడ్డారు.
ఇళ్లకు ఫోన్లు చేసి డబ్బులు తెప్పించుకుని కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకుని ఇంటికి చేరినవారు కొందరుంటే, చాలామంది యాత్రను కొనసాగించలేక తిరుగుముఖం పట్టారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది బాధితులు స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లగా.. ఆ ట్రావెల్ ఆఫీస్ టూటౌన్ పరిధిలోనిదని అక్కడికెళ్లి ఫిర్యాదు చేయాలని, లేదంటే ఎవరి ఊళ్లో వారు ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. దీంతో వారంతా మీడియాతో తమ బాధను వెల్లడించారు.
హరిద్వార్ తీసుకెళ్లి వదిలేశాడు
సరస్వతీ నది పుష్కరాలు, కేదార్నా«థ్ యాత్ర అంటే ఒకేసారి రెండు అవకాశాలు రావటం అదృష్టమన్న భావనలో గురుమూర్తి అడిగినంత డబ్బు ఇచ్చి బయల్దేరాం. ఢిల్లీకి, అక్కణ్నుంచి హరిద్వార్కు తీసుకెళ్లి వదిలేశాడు. ఇప్పటికీ ఆచూకీ తెలియటం లేదు. బాధ్యుడిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. – దుర్గాప్రసాద్, చీరాల