
నాదెండ్ల(చిలకలూరిపేట) : వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి కార్యక్రమాన్ని ముగించుకుని ఇళ్లకు తిరిగి వెళ్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు కత్తులు, రాడ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు. గుంటూరు జిల్లా నాదెండ్లలోని చినమాలపల్లెలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ముగ్గురు వైఎస్సీర్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. నాదెండ్లలో మహానేత వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి వెళ్తుండగా తమ ఇళ్లపై బాణసంచా కాల్చి వేశారంటూ టీడీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. అంతేకాకుండా కత్తులతో దాడికి తెగబడ్డారు. (నెల్లూరులో బాలుడి కిడ్నాప్ కలకలం)
ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వలేరు రాజేష్, రాఘవ, రాజారావులకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ కేవీ నారాయణరెడ్డి ఆసుపత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన 11 మంది టీడీపీ వర్గీయులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్బలంతోనే టీడీపీ వర్గీయులు దాడికి తెగబడ్డారని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. (వరకట్న వేధింపులకు మహిళ మృతి )