తాడిపత్రిలో పోలీసు రాజ్యం | Tense situation once again in Tadipatri town of Anantapur district | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో పోలీసు రాజ్యం

Jun 30 2025 3:44 AM | Updated on Jun 30 2025 3:44 AM

Tense situation once again in Tadipatri town of Anantapur district

కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్తున్న పోలీసులు

సొంతింటికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి 

బలవంతంగా అనంతపురం తరలింపు 

శాంతి భద్రతల పేరిట ఏకపక్ష విధానం 

పెద్దారెడ్డికి రక్షణ కల్పించి తీసుకెళ్లాలని హైకోర్టు చెప్పినా పట్టించుకోని పోలీసులు 

టీడీపీ నాయకులు చెప్పినట్టు ఎస్పీ ఆడుతున్నారని విమర్శలు 

వైఎస్సార్‌సీపీ నాయకులను ‘రప్పా.. రప్పాలాడిస్తాం’ అంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి బెదిరింపులు

సాక్షి టాస్క్ ఫోర్స్: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆదివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన సొంతింటికి చేరుకున్నారు. ఈ విషయం తెలియగానే వందలాది మంది వై­ఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను కలవడానికి బయలుదేరారు. దీంతో పోలీసులు పె­ద్ద­­ఎత్తున బలగాలను మోహరించారు. కేతిరెడ్డి ఇం­టిచుట్టూ వలయాకారంలో బారికేడ్లు పెట్టి వైఎస్సా­ర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను కలవకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కేతిరెడ్డి ఇంటి పరిసరాల్లోకి సైతం ఎవరూ వెళ్లకుండా నిలువరించారు. 

బలవంతంగా తరలింపు 
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి చేరుకున్నారన్న విషయం తెలుసుకున్న ఏఎస్పీ రోహిత్‌కుమార్, సీఐ సాయిప్రసాద్, ఎస్‌ఐ ధరణి సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆయనను బయటకు రావాలని కోరారు. దీంతో పోలీసులతో కేతిరెడ్డి మాట్లాడుతూ.. ‘హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తాడిపత్రికి వెళ్తానని ఎన్నిసార్లు ఎస్పీకి విన్నవించుకున్నా ఏదో ఒక సాకు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇష్టానుసారం వ్యవ­హరిస్తున్నారు. 

ఎవడు పడితే వాడితో పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వం అంటూ కారుకూతలు కూయిస్తుంటే చూస్తూ కూర్చోవాలా? చేతనైతే పోలీసులు లేకుండా వాడు (జేసీ ప్రభాకర్‌రెడ్డి), అతడి కార్యకర్తలు నన్ను ఆపమనండి’ అంటూ సవాల్‌ విసిరారు. ఏఎస్పీతో మాట్లాడాలని సీఐ సాయిప్రసాద్‌ సూచించడంతో ఆయనతో మాట్లాడేందుకు పెద్దారెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. దీంతో ఆయనను కార్యకర్తల తోపులాట మధ్య బలవంతంగా పోలీస్‌ జీపులో అనంతపురం తరలించారు.   

జేసీ ప్రభాకర్‌ ఓవరాక్షన్‌ 
కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చారన్న సమాచారంతో మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఓవరాక్షన్‌ చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలను పెద్దసంఖ్యలో ఇంటికి పిలిపించుకున్నారు. ట్రాక్టర్లలో రాళ్లను తీసుకొచ్చి.. రాళ్ల దాడి చేసేందుకు కేతిరెడ్డి ఇంటివైపు బయలుదేరారు. వారిని సీఐ శివగంగాధర్‌రెడ్డి, సిబ్బంది జేసీ ఇంటివద్దే నిలువరించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అనంతపురం తరలించారన్న సమాచారంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగారు.   

కోర్టు ఉత్తర్వులిచ్చినా.. 
కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా అడ్డుకున్నారు. రాళ్ల దాడులకు దిగారు. పదేపదే పోలీసులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. దీంతో మాజీ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు. స్వయానా హైకోర్టు పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు రక్షణ కల్పించా­లని ఆదేశించింది. అయినా అనంతపురం జిల్లా పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం పేరుతో పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వడంలేదు.

ఏదో సాకుతో వాయిదా వేస్తూనే ఉన్నారు. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి విసిగిపోయారు. పదే పదే ఎస్పీకి లేఖలు రాసినా స్పందించలేదు. పోలీసులు తనకు రక్షణ కల్పించే విషయంలో సహకరించబోరన్న విషయం తెలుసుకున్న పెద్దారెడ్డి ఆదివారం ఉదయం తాడిపత్రి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

పోలీసులు వెంటనే పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. మాజీ ఎమ్మెల్యేకు జిల్లా పోలీసులు రక్షణ కల్పించలేక ఆయన్ను బలవంతంగా అనంతపురం తీసుకురావడం విమర్శలకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి రక్షణ కల్పించలేక జిల్లా ఎస్పీ సైతం తీవ్ర విమర్శల పాలవుతున్నారు.  

‘రప్పా.. రప్పాలాడిస్తాం’ 
టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి 
‘ఈ రోజు నీ దగ్గరకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను రప్పా.. రప్పాలాడిస్తాం. చేతనైతే కాపాడుకో కేతిరెడ్డీ’ అంటూ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసిన తర్వాత జేసీ తన ఇంటివద్ద విలేకరులతో మాట్లాడారు. 

కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరెవరు వచ్చారో వారి జాబితా, ఫొటోలు తనవద్ద ఉన్నాయని, వారిని ఇకపై టీడీపీ కార్యకర్తలు రప్పా.. రప్పాలాడిస్తారని అన్నారు. తాడిపత్రిలో­ని వైఎస్సార్‌సీపీ వాళ్లు శత్రువులు కాదంటూనే ఈ వ్యాఖ్యలు చేశా­రు.  ‘ఈరోజు మా వాళ్లను గట్టిగా పట్టుకుని కూర్చున్నా. రేపటి నుంచి నేను ఊళ్లో ఉండను. ఓ వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్త చాలా మాట్లాడుతోంది. మా మహిళా కార్యకర్తలూ ఉన్నారు.’అని జేసీ అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement