TDP Leaders Kotamreddy Srinivasulu Reddy Over Action In Police Station - Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌లో కోటంరెడ్డి రాద్ధాంతం

Jun 13 2023 1:08 PM | Updated on Jun 13 2023 2:57 PM

TDP Leaders Kotamreddy Srinivasulu Reddy over action in police station - Sakshi

నెల్లూరు(క్రైమ్‌): అన్నదమ్ములపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడిని వెంటనే తనతో పంపాలని టీడీపీ నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆదివారం అర్ధరా త్రి నెల్లూరు సంతపేట పోలీస్‌స్టేషన్‌లో రాద్ధాంతం చేశారు. పోలీసుల కథనం మేరకు.. గాంధీ గిరిజన కాలనీకి చెందిన దేవరకొండ వెంకట్, అతడి అన్న సుసేంద్ర, అదే ప్రాంతానికి చెందిన హరికృష్ణ మరికొందరు ప్రభుత్వ ఐటీఐ వద్ద ఆదివారం క్రికెట్‌ ఆడుతుండగా సుసేంద్ర, హరికృష్ణ మధ్య వివాదం జరిగింది. కొద్దిసేపటికి సద్దుమణగడంతో అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. హరికృష్ణ అదేరోజు సాయంత్రం సుసేంద్రకు ఫోన్‌ చేసి తిట్టాడు. 

కొద్దిసేపటి తర్వాత గొడవను సర్దుబాటు చేసుకుందామని సుసేంద్రకు ఫోన్‌ చేశాడు. దీంతో అతను తన సోదరుడు వెంకట్‌తో కలిసి ఐటీఐ కళాశాల వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ హరికృష్ణ, అతని బంధువులైన చంద్రమౌళి, స్నేహితుడు నవీన్, రవీంద్ర తదితరులున్నారు. ఉదయం జరిగిన గొడవను మనసులో పెట్టుకుని వారు ఇనుపరాడ్‌లు, కర్రలతో వెంకట్, సుసేంద్రపై దాడి చేశారు. సుసేంద్ర కేకలు వేస్తూ పరుగులు తీయగా బ్రిడ్జి వద్ద నున్న కిశోర్, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై సైతం దాడి జరిగింది. ఇంతలో గ్రామస్తులు రావడంతో నిందితులు పరారయ్యారు.

 గాయపడిన వెంకట్, సుసేంద్రను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేరి్పంచారు. బాధితులు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు రాత్రి కేసు నమోదు చేశారు. నిందితుల్లో కొందరిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారు టీడీపీకి చెందిన వారు కావడంతో కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వెంటనే స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. టీడీపీ నేత అయిన నవీన్‌ను అక్రమంగా ఇరికించారని, వెంటనే తనతో పంపాలని లేకపోతే స్టేషన్‌లోనే పడుకుంటానని నానా రాద్ధాంతం చేశారు. స్థానిక పోలీస్‌ అధికారులతోపాటు నగర డీఎస్పీపై ఒత్తిడి తెచ్చాడు.  విచారించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో కొద్దిసేపు హడావుడి చేసి వెళ్లిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement