ఉత్తమ ప్రతిభకు ఉజ్వల భవిత | Talent hunt in Andhra | Sakshi
Sakshi News home page

ఉత్తమ ప్రతిభకు ఉజ్వల భవిత

Dec 17 2023 5:16 AM | Updated on Dec 17 2023 5:16 AM

Talent hunt in Andhra - Sakshi

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలోని క్రీడాకారుల­కు ఉజ్వల భవిష్యత్తు అందించే దిశగా ప్రభు­త్వం అడుగులు వేస్తోంది. గ్రామీణ క్రీడాకారుల్లోని సత్తాను వెలుగులోకి తెచ్చేలా ‘ఆడు­దాం ఆంధ్ర’ వేదికను సిద్ధం చేస్తోంది. దేశంలోనే అతిపెద్ద ఈ మెగా టోర్నిలో టాలెంట్‌ హంట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో (క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ డబుల్స్‌) మహిళలు, పురుషుల్లో అత్యుత్తమ ప్రదర్శన  కనబరిచిన వారిని ఎంపికచేసి వారి ప్రతిభకు పట్టం కట్టేలా ప్రణాళికలు రచిస్తోంది. గ్రామ/వార్డు సచివాలయాలు, మండలస్థాయి పోటీల అనంతరం 175 నియోజక వర్గాలు, 26 జిల్లాల స్థాయిలో జరిగే పోటీలను నిశితంగా పర్యవేక్షించనుంది. వీటిల్లో రాణించిన క్రీడాకారుల వివరాలతో ప్రత్యేక జాబితాను తయారు చేయనుంది.
 
అత్యుత్తమ శిక్షణ దిశగా.. 
క్రీడాసంఘాల ప్రతినిధులతో పాటు ఫ్రాంచైజీల ప్రత్యేక బృందాలు ‘ఆడుదాం ఆంధ్ర’ నియోజకవర్గ, జిల్లా స్థాయి పోటీలను దగ్గరుండి పర్యవేక్షించనున్నాయి. మైదా­నంలో మెరుగైన ప్రదర్శ­నతో ఆకట్టుకున్నవా­రిని నేరుగా ఫ్రాంచైజీలే దత్తత తీసు­కుని శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఉదాహరణకు క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న యు­వతకు సీఎస్‌కే, ఇతర క్రికెట్‌ ఫ్రాంచైజీల్లో శిక్షణతో పాటు భవిష్య­త్తు సీజన్‌లో జట్టులో ప్రాతినిధ్యం వహించే అవకా­శం దక్కుతుంది.

కబడ్డీ, వాలీబాల్లో రాణించి­న వారిని కూడా పీకేఎల్, పీవీఎల్‌లకు ఆయా జట్లు ఎంపిక చేసుకోవచ్చు. బ్యాడ్మింటన్‌లో అయితే అంతర్జాతీయ క్రీడాకారులు నెలకొల్పిన అకాడమీల్లో ఉత్తమ తర్ఫీదు లభిస్తుంది. ఇక్కడ ప్రతిభ చూపిన క్రీడాకారులకు వారి స్థాయిలను బట్టి వివిధ మా­ర్గాల్లో శిక్షణ లభిస్తుంది. త­ద్వారా వారి ప్రతి­భ మరింత మెరుగుపడనుంది.

ప్రముఖ క్రీడా ఫ్రాంచైజీలతో..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిభావంతులైన క్రీడాకా­రులున్నా.. ఇప్పటివరకు సరైన దిశలో నడిపించేవారులేక  గ్రామాల్లోనే నిలిచిపోతు­న్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ‘ఆడు­దాం ఆంధ్ర’ ద్వారా వారందరినీ గుర్తించే మహాయజ్ఞాన్ని తలపెట్టింది. రాష్ట్రంలోని క్రీడాసంఘాలతో పాటు ప్రముఖ క్రీడా ఫ్రాంచైజీలను ఇందులో భాగస్వాములను చేస్తోంది. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌తో క­లిసి క్రికెట్‌ టాలెంట్‌ను గుర్తించేందుకు ఇప్పటికే చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్‌కే) అంగీకారం తెలిపింది.

ముంబై ఇండియ­న్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీలతోనూ శాప్‌ అధికారులు సంప్రదింపు­లు చేస్తున్నారు. కబడ్డీలో తురుపుముక్కల­ను ఎంపికచేసే బాధ్యతను ప్రో కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) తీసుకుంది. వాలీబాల్‌లో ప్రతిభను ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) సంస్థ ఒడిసిపట్టనుంది. అంతర్జాతీయ క్రీడా­కారులతో పాటు ఖోఖో, బ్యాడ్మింటన్‌ అసోసి­యేషన్లు సహకారం అందించనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement